
నీకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు..
సీఎం కేసీఆర్పై బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఫైర్
దుబ్బాకలో దళిత మోర్చా ర్యాలీ, సభ
సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆరేండ్లలో వందల ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చాయి కానీ… రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్
వెంకటస్వామి అన్నారు. ‘కాళేశ్వరం’ కమీషన్ల డబ్బుతో కేసీఆర్ దుబ్బాక బైఎలక్షన్లో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గురువారం దుబ్బాక టౌన్ బాలాజీ ఫంక్షన్ హాల్ లో దళిత మోర్చా నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం సొంతూరు చింతమడకలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి రాష్ట్రంలోని పేదలకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే సీఎం నుంచి ఆన్సర్ లేదన్నారు. ఆయన మాత్రం కమీషన్ల డబ్బుతో వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకుంటున్నారని విమర్శించారు. కొడుకు కేటీఆర్, కూతురు కవిత సైతం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని చెప్పారు. పేదల ఇండ్ల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే వాటిని ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుకు వాడుకొని కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. ఇకపై డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునే వారికి కేంద్రమే నేరుగా నిధులు ఇచ్చేలా కోరుతామన్నారు. ప్రశ్నించే గొంతుకైన రఘునందన్రావును దుబ్బాక ప్రజలు గెలిపించాలని కోరారు. ఎన్నికల టైమ్లో మోసపూరిత హామీలతో వస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ దళితులు ఎవరికి వోటు వేస్తే ఆ క్యాండిడేటే గెలుస్తాడని.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్కు దళితులంటే గౌరవం లేదన్నారు. ప్రజల మొఖం చూడని సీఎం దేశంలో ఎవరైనా వున్నారంటే.. అది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. మాజీ మంత్రి బాబుమోహన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి ఇన్నేండ్లు అయితున్నా దళితుల అభివృద్ధి జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీటింగ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు, సింగరేణి కార్మిక సంఘం నేత కె.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు మునుపు దుబ్బాక బస్ డిపో నుంచి బీజేపీ ఎన్నికల కార్యాలయం వరకు దళిత మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు.
For More News..