- హైదరాబాద్ ఇమేజ్ను దిగజార్చిండు: వివేక్
- లివింగ్ ఇండెక్స్లో సిటీని 4 నుంచి 24కు తెచ్చిండు
- వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 7 ఎంపీ సీట్లలో, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయిండు
- రాష్ట్రం నిర్లక్ల్యంతోనే ఐటీఐఆర్ వెనక్కిపోయింది
హైదరాబాద్, వెలుగు: ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. నివాసయోగ్యమైన నగరాల్లో 2014లో4వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 24వ ప్లేస్కు దిగజారిపోయిందని అన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 7 ఎంపీ స్థానాల్లో, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడారని చెప్పారు. పొలిటికల్గానే కాకుండా అడ్మినిస్ట్రేషన్లోనూ కేటీఆర్ ఫెయిల్ అయ్యారని అన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ నేత ప్రకాశ్రెడ్డితో కలిసి మీడియాతో వివేక్ మాట్లాడారు. ముద్ర లోన్లపై అన్నీ తప్పులు, అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్పై మండిపడ్డారు. కేంద్రం డేటా ప్రకారం ఈ ఏడాది తెలంగాణలో రూ. 4,705 కోట్ల ముద్ర లోన్లను11.35 లక్షల మందికి ఇచ్చారని, ఈ రుణాల్లో రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ ఉందని తెలిపారు. ముద్ర లోన్లలో రాష్ట్రం 2018-–19లో సెకండ్ ప్లేస్, 2017–-18లో థర్డ్ ప్లేస్లో ఉందన్నారు. కేంద్ర పథకాలు అమలు చేస్తే ప్రధాని మోడీ ఫొటో పెట్టాల్సి వస్తుందనే రాష్ట్రంలో అమలు చేయట్లేదన్నారు. కరోనా టైంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయలేదని, దీంతో రూ. 300 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రానికి ఇంకా ఎక్కువ నిధులివ్వడానికి కేంద్రం రెడీగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయని చెప్పారు.
ఐటీఐఆర్ ఏర్పాటుకు రాష్ట్రం ఫెసిలిటీస్ కల్పించలే
ఐటీఐఆర్ విషయంలో కేంద్రానిదే తప్పని కేటీఆర్ లేఖల మీద లేఖలు రాస్తున్నారని, అసలు ఐటీఐఆర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రం ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించలేదని, 2018 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివేక్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ల్యం వల్లే ఐటీఐఆర్ వెనక్కిపోయిందన్నారు. ఐటీఐఆర్ను మర్చిపోయి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఐటీఐఆర్కు సపోర్ట్ చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలోకి తేవచ్చని కేంద్రం ప్రకటించిందని, దీంతో లీటర్పై రూ. 25 తగ్గే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా, సిటీకి వరదలప్పుడు జనాన్ని పట్టించుకోలే
కరోనా టైంలో, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు రాష్ట్ర సర్కారు భరోసా కల్పించలేదని వివేక్ విమర్శించారు. సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయన్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటులో రాష్ట్రం ఫెయిల్ అయిందని విమర్శించారు. స్టేడియంలు లేకపోవడం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి జరగడంతో సిటీలో ఐపీఎల్ మ్యాచ్లు పెట్టడం లేదన్నారు. ప్రజల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని, కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఫ్యాక్టరీనీ రీ ఓపెన్ చేయలేదని మండిపడ్డారు.