జగిత్యాల, వెలుగు: పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలానికి చెందిన తెలంగాణ జాగృతి మాజీ అధ్యక్షుడు బొడ్డు అనిల్, నీటిపారుదల సంఘం మాజీ అధ్యక్షుడు పోల్లంపల్లి మల్లేశంతోపాటు వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్కు చెందిన 200 మంది యువకులు బీజేపీలో చేరారు. వీరికి వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని కేసీఆర్ మాయమాటలు చెపితే జనం ఓట్లేశారని, తీరా గెలిచాక హామీలన్నీ మరిచిపోయారని విమర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందనుకున్నవారికి చివరికి నిరాశే మిగిలిందన్నారు. కమీషన్ల కోసమే రూ.70వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. రైతులకు రుణమాఫీ ఇవ్వకపోవడంతో అప్పులు చేసి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ తెచ్చిన అగ్రికల్చర్ బిల్లులపై రైతుల్లో వ్యతిరేకత లేకున్నా.. సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లో ప్రజల ముందు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లీడర్లు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా బీజేపీలో చేరడానికి వచ్చిన యువకులకు వివేక్ థ్యాంక్స్చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ నేతలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎండీ బషీర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి కన్నం అంజయ్య, పెద్దపల్లి జిల్లా బీజేపీ లీడర్లు కాడే సూర్యనారాయణ, జాడి రాజేశం, జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంచే రాజేశ్, ధర్మపురి మండల అధ్యక్షుడు సంగెపు గంగారాం, గొల్లపెల్లి మండల అధ్యక్షుడు కట్ట మహేష్, బుగ్గారం మండల అధ్యక్షుడు మంచాల పరశురాం, వెల్గటూరు మండల అధ్యక్షుడు తంగళ్లపల్లి చక్రపాణి, ధర్మారం మండల అధ్యక్షుడు యాద తిరుపతిరెడ్డి, పెగడపల్లి మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.
