కండ్ల డాక్టర్‌కు చూపించుకోండి.. బీజేపీ నేతలకు చిదంబరం సెటైర్

కండ్ల డాక్టర్‌కు చూపించుకోండి.. బీజేపీ నేతలకు చిదంబరం సెటైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తుండటంతో బీజేపీ నేతలు మిడిల్ స్కూల్ కు వెళ్లాలని లేదా కండ్ల డాక్టర్ కు చూపించుకోవాలని కాంగ్రెస్ నేత పి. చిదంబరం అన్నారు. వారసత్వ సంపద అనే పదాన్ని సంపద పంపిణీగా ప్రచారం చేస్తుండటంతో వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వేగవంతమైన అభివృద్ధి, సంపద ఉత్పత్తికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

 సోమవారం చిదంబరం విలేకర్లతో మాట్లాడాడారు. ‘‘వస్తు సేవల ఉత్పత్తిని భారీగా పెంచడానికి పారిశ్రామిక, వాణిజ్యానికి సంబంధించిన పాలసీలు, నిబంధలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాం. స్వేచ్ఛా వాణిజ్యాన్ని నిరోధించే అన్ని చట్టాలు, నిబంధనలను సమీక్షిస్తాం. వాటిలో మార్పులు చేస్తాం. యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే భారత ఆర్థికవ్యవస్థ రెట్టింపు అయ్యి రూ.200  లక్షల కోట్లకు చేరుకుని ఉండేది. ప్రతి పదేండ్లకు జీడీపీని రెట్టింపు చేయాలని మేం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వారసత్వ సంపద అనే పదాన్ని సంపద పంపిణీగా చదివితే బీజేపీ నేతలు మిడిల్ స్కూల్ కు వెళ్లాలి లేదా కండ్ల డాక్టర్​కు చూపించుకోవాలి’’ అని పేర్కొన్నారు.