
- బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు గడిచిన 18 నెలల కాలంలో కేవలం మహిళలకు మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రమే అమలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ బస్సుల్లోను భారీ ఎత్తున స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం సబ్సిడీతో ఇస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వాడుకుంటోందని విమర్శించారు. జన గణనతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడక అని తెలిపారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో 45 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని ఆరోపించారు.