- ల్యాండ్ సెటిల్మెంట్లో ఘర్షణ.. పోలీస్ స్టేషన్లోనే కాల్పులు
- ఎమ్మెల్యే గణ్పత్ అరెస్టు.. హత్యాయత్నం కేసు నమోదు
థానే, ముంబై: మహారాష్ట్రలో శివసేన షిండే వర్గానికి చెందిన నేతలపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. ల్యాండ్సెటిల్మెంట్ విషయంలో శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఫైరింగ్కు దారితీసింది. అధికార కూటమి పార్టీల నేతల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.
భూ వివాదంపై మాట్లాడేందుకు శివసేన షిండే వర్గం కళ్యాణ్ జిల్లా అధ్యక్షుడు మహేశ్ గైక్వాడ్, మరో నేత రాహుల్ పాటిల్ తమ అనుచరులతో కలిసి శుక్రవారం రాత్రి ఉల్హాస్నగర్లోని హిల్లైన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సీఎం షిండే కొడుకు, కళ్యాణ్ ఎంపీ శ్రీకాంత్ షిండేకు వీరు సన్నిహితులు. వీరు పోలీస్స్టేషన్లో ఉన్న టైమ్లోనే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు సన్నిహితుడైన బీజేపీ కళ్యాణ్ఈస్ట్ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ తన కొడుకు, అనుచరులతో కలిసి అక్కడి చేరుకున్నారు. అక్కడ సీఐ ఆఫీసులో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణ్పత్ తన తుపాకీతో మహేశ్ గైక్వాడ్, రాహుల్ పాటిల్పై ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా మహేశ్ గైక్వాడ్ శరీరం నుంచి ఆరు బుల్లెట్లు, రాహుల్ పాటిల్ శరీరం నుంచి రెండు బుల్లెట్లు తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు. మహేశ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని.. రాహుల్ కూడా ఐసీయూలోనే ఉన్నాడని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే గణ్పత్ ను అరెస్టు చేశామని.. అతనిపై ఐపీసీ 307, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తాత్రేయ షిండే శనివారం తెలిపారు. అరెస్టుకు ముందు గణ్పత్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో తన కొడుకుపై శివసేన నేతలు, వారి అనుచరులు దాడి చేస్తుంటే ఆత్మరక్షణ కోసమే ఫైరింగ్ చేశానని చెప్పారు. వారిపై కాల్పులు జరిపినందుకు తాను ఏమాత్రం విచారం, పశ్చాతాపం చెందడం లేదని అన్నారు.