తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు.
కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్ లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు.
గజ్వేల్ అభివృద్ధి చూసేందుకు మహారాష్ట్ర రైతులకు, పీకేకు, ప్రకాష్ రాజ్ లకు అవకాశం ఉంటుంది కానీ తమను ఎందుకు రానివ్వరని ప్రశ్నించారు రఘునందన్ రావు. ఏదో రోజు టైం, డేట్ చెప్పకుండా గజ్వేల్ కు వస్తామన్నారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండబోదని.. పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు.