రాజేంద్ర నగర్: దేశంలో మత కలహాలు కేవలం తెలంగాణలోనే జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాజేంద్ర నగర్లోె నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భైంసా, కరీంనగర్ల్లో మత కలహాలు జరుగుతున్నాయని అర్వింద్ చెప్పారు. హిందువుల మీద దొంగ కేసులు పెడుతున్నారని, హిందూ పండుగలను జరుపుకోనివ్వడం లేదని మండిపడ్డారు. ఎంఐఎం చేతిలో అమ్ముడుపోయిన వేస్ట్ ఫెలోలు కేసీఆర్, కేటీఆర్ అని విమర్శించారు.
‘హిందువుల ఆత్మగౌరవాన్ని మొత్తంగా అమ్మేసిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మనందరం కలసి హిందూ సమాజం నుంచి కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి. ఇందూర్లో, దుబ్బాకలో రాజుకున్న మాదిరిగా జీహెచ్ఎంసీలోనూ అగ్గి రాజుకోవాలి. కేంద్రం నుంచి బీజేపీ జాతీయ నేతలు దిగుతున్నారు. ఈ ఒత్తిడికి భయపడి కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవద్దు. ఏడేళ్లు సీఎంగా ఉన్నావ్ కదా అదే చాలు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు 99 సీట్లు ఇస్తే 100 పనులు చేశారట. చేసిన అభివృద్ధేం లేదు. జిమ్లు పెట్టినం, రోడ్లు పూడ్చినం అంటున్నారు’ అని అర్వింద్ పేర్కొన్నారు.