ఇందల్వాయి, వెలుగు: యాసంగిలో వరి సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో ఆయన ఆదివారం పలు డెవలప్మెంట్ పనులు ప్రారంభించారు. బాయిల్డ్ రైస్ సప్లై చేయబోమని కేంద్రానికి లెటర్ ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రైతులు వరినాట్లు పూర్తి చేశారని, వడ్లను క్వింటాలుకి రూ.1500 చొప్పున కొంటామని మిల్లర్లు ముందుకొచ్చారని వివరించారు. రైతులు కోల్పోయే మొత్తాన్ని బోనస్గా ఇవ్వాలన్నారు. కేంద్రం మెడ మీద కత్తి పెట్టి లెటర్ రాయించుకుందని అంటున్న సీఎం కేసీఆర్ వెంటనే రిజైన్ చేయాలన్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసని, కేంద్రం నుంచి ఫండ్స్ రాకుంటే కేసీఆర్ కోడిగుడ్డు కూడా కొనలేరన్నారు. పసుపు రైతులకు సీఎం కేసీఆర్ చేసిందేమీలేదన్నారు. చిన్నచిన్న రాష్ట్రాలు తమ పంటలతో బ్రాండ్లను క్రియేట్ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్పైసెస్ బోర్డ్ ఏర్పాటు చేసి, పసుపు పంట అభివృద్దికి రూ.30 కోట్లు కేటాయించామన్నారు. పసుపు దిగుమతులు ఆపేసి.. ఎక్స్పోర్ట్ చేస్తున్నామని, నిజామాబాద్ నుంచి సాంగ్లీకి పసుపు తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎంపీ పర్యటనలో ఉద్రిక్తత
డెవలప్మెంట్ పనులు ప్రారంభించేందుకు వస్తున్న ఎంపీ అర్వింద్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పక్కకు నెట్టేసి పోలీసులు ఎంపీ కాన్వాయ్ ని పంపించారు. దాడులు చేస్తే భయపడేది లేదని అర్వింద్ అన్నారు. డెవలప్మెంట్ వర్క్స్ లో 60 శాతం ఫండ్స్ కేంద్రానినని, ఎంపీగా పనులను ప్రారంభించే హక్కు తనకూ ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓర్వలేక దాడులు చేయించారన్నారు. బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జ్ దినేష్ కుమార్, సర్పంచ్ మోహన్ రెడ్డి, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, ఇందల్వాయి మండల అధ్యక్షుడు రాజన్న పాల్గొన్నారు.