సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం దాచారంలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నడుపుతున్న శ్రీహర్ష అతని భార్య రుక్మిణి, కూతురు అప్పుల బాధతో ఆత్మహత్యకు చేసుకున్నారు.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం అనిల్ అనే వ్యక్తికి లక్షల రూపాయల మేర అప్పు ఇప్పించడంతో పాటు, అభిషేక్, రాజశేఖర్, భూపతిరెడ్డి, శ్రీనివాస్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అభిలాష్, భూపతిరెడ్డి శ్రీహర్షను తరచూ బెదిరించడం వల్లే అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీహర్ష, రుక్మిణి దంపతులు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
►ALSO READ | కల్వకుర్తి పట్టణంలోని చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అప్పుల వ్యవహారం, బెదిరింపులపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో దాచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన మృతుల ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. వడ్డీలు కడుతున్నప్పటికీ అప్పు ఇచ్చిన అభిలాష్, భూపతిరెడ్డిలు పదే పదే వేధింపులకు గురిచేయడం, బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లో రాయడం కలకలం రేపుతోంది.
