హిమాచల్ ప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ను ఆయన నియోజకవర్గమైన సెరాజ్ నుండి బరిలోకి దింపింది. నేడు ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ 2017 ఎన్నికల్లో ఓడిపోయినందున ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు.
68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హిమాచల్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 43 మంది, కాంగ్రెస్కు 22 మంది సభ్యులున్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. అక్టోబరు 17న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబరు 27న పేపర్ల పరిశీలన, ఉపసంహరణకు అక్టోబర్ 29 చివరి తేదీ. కాగా 2017 ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్కు 21 సీట్లు వచ్చాయి.
