కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ సక్సెస్ అయిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. అమిత్ షా టూర్ వలన ప్రజల్లో, బీజేపీ కార్యకర్తల్లో మరింత జోష్ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటకు బీఆర్ఎస్ తో కొట్లాడుతున్నట్లుగా గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ.. లోపల బీఅర్ఎస్,కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
రాబోయే రోజుల్లో వారి చీకటి స్నేహం బయట పడుతోందని తరుణ్చుగ్ తెలిపారు. రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అవినీతి సొమ్ముతో రాజ్యమేలుతుందన్న అన్న ఆయన.. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని,అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సీట్లు తమ పార్టీకి వస్తాయని తరుణ్చుగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.