పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు
కోర్ కమిటీ భేటీలో నడ్డా
హైదరాబాద్, వెలుగు : పార్టీ లైన్ను ఎవరు దాటినా ఉపేక్షించేది లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చరించారు. పార్టీ విషయాలపై లీకులు ఇచ్చినా, నోరు జారినా సహించేది లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు ఒక్కటికావని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశం అనంతరం శంషాబాద్ నోవాటెల్లో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి నియమితులయ్యాక ఆయన అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశం ఇది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ , ఈటల రాజేందర్, లక్ష్మణ్, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, నాయకత్వ మార్పు అనంతర పరిణామాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పారు. కాగా, సోమవారం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరుగనుంది. ఇందులో ప్రజా సమస్యలపై ఓ కార్యాచరణ రూపొందించనున్నారు.