కోల్కతా: రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఊపుమీదున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ పవర్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అక్కడ 18 సీట్లు సాధించిన కమలదళం.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం బ్లూ ప్రింట్ను సిద్ధం చేస్తోంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 148 సీట్లు తప్పనిసరి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ 211 సీట్లు సాధించగా.. బీజేపీ కేవలం 6 ఎమ్మెల్యే స్థానాలనే గెలుచుకుంది. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 18 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అధికార టీఎంసీ 22 సీట్లకు పడిపోయింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 40.5శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఓట్ షేర్ తమకు కలిసి వస్తుందని, ఎక్కడెక్కడ పార్టీ వీక్ ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి కైలాశ్ విజయ్వర్గియా తెలిపారు. రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కనీసం 250 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మమతా బెనర్జీ ‘బెంగాల్ ప్రైడ్’ నినాదాన్ని ఎత్తుకోగా.. బీజేపీ మాత్రం ఇండస్ట్రియలైజేషన్, సిటిజన్ షిప్ బిల్లు,ఎన్ఆర్సీ బిల్లు అమలు పేరిట జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
నాలుగు కేటగిరీలుగా..
లోక్సభ ఎన్నికల్లో తాము 23 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 18 సీట్లు వచ్చాయని కైలాశ్ విజయ్వర్గియా అన్నారు. ఐదేళ్లలో రెండు సీట్ల నుంచి 18 సీట్లకు చేరుకోవడం గొప్ప విజయమని, బీజేపీపై జనంలో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని, మమతా బెనర్జీని అధికారంలో నుంచి దించుతామని ధీమా వ్యక్తం చేశారు. గ్రౌండ్లెవల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం సిద్ధం చేసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాలు, పార్టీ రెండోస్థానానికి, మూడోస్థానానికి, నాలుగో స్థానానికి పరిమితమైన నియోజకవర్గాలను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఈ కేటగిరీల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు. పక్కగా పార్టీ గెలుస్తుందన్న నమ్మకమున్న 130 ఎమ్మెల్యే సీట్లను ఏ–కేటగిరీలో ఉన్నాయి. బీ–కేటగిరీలోని 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి ఎంపీ ఎన్నికల్లో తాము రెండో స్థానానికి పరిమితమయ్యామని, అక్కడ కూడా అధిక సీట్లు కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు.