కేసీఆర్ ధ్యాసంతా బార్, బీర్ మీదే..

కేసీఆర్ ధ్యాసంతా బార్, బీర్ మీదే..

మెదక్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజాసంగ్రామ యాత్ర’ 13వ రోజున అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్ర ప్రజల కష్టాలను, టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, అసమర్థతను, నిర్లక్ష్యాన్ని ప్రజల నుంచి స్వయంగా చూపెట్టింది. యాత్ర సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ అంటేనే తుగ్లక్ అని.. టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ అని.. మజ్లిస్ పార్టీ తాలిబన్ పార్టీ అని సంజయ్ అన్నారు.

కేసీఆర్ ధ్యాసంతా బార్, బీర్ మీదే తప్ప జనం మీద లేదు
‘పాదయాత్రలో ప్రజలు బాధలు చెప్పుకుంటున్నరు. టీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను ఆవేదన రూపంలో వెల్లడిస్తున్నారు. రోడ్డు కోసం స్థలమిస్తే....ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టియ్యలేదు. నేను వెళ్లి చూశాను. వాళ్లు ఎట్ల బతుకున్నరో అని బాధేస్తోంది. కిలోమీటర్ కో బారు పెట్టిండు. కేసీఆర్ సార్ ధ్యాసంతా బార్, బీర్ మీదే తప్ప జనం మీద లేదు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదు. జనం ఇల్లు లేక నానాపాట్లు పడుతున్నరు. ఎన్నికలొస్తే... ఓ ఇద్దరి ముగ్గురికి ఇండ్లిస్తడు. తరువాత పత్తా లేకుండా పోతడు. ఇదేం ప్రభుత్వం?

మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ అయ్యింది
ఇంటికో ఉద్యోగమన్నడు.. కానీ ఇయ్యలేదు. అదే తన కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రం ఉద్యోగాలిచ్చుకుండు. 1400 మంది యువకుల బలిదానాలు వృధా అవుతున్నయ్. మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని తెలంగాణ తల్లి ఘోషిస్తోంది. ఈరోజు కాళోజీ జయంతి. తెలంగాణ కోసం చావుకు భయపడని వ్యక్తి. చచ్చినా, బతికినా దేశం కోసమేనన్నడు. పరాయివాడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొట్టండి. మనోడు ద్రోహం చేస్తే ఇక్కడే పాతిపెట్టాలన్నడు. మరి ద్రోహం చేస్తున్న కేసీఆర్‎ను ఏం చేయాలి? యువకులు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారింది. తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయాలి.

కేసీఆర్ కుక్కకున్న విలువ, పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయింది
తెలంగాణలో 6.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేసిండ్రు. జనం చస్తుండ్రు. రైతులు నష్టోయిండ్రు. కానీ సార్ ఢిల్లీకి పోయి పడుకుండు.  అసలు ఫాంహౌజ్‎లో ఏం చేస్తడో అర్ధం కాదు. ఏడు ఏళ్లు ఫాంహౌజ్‎కే పరిమితమైండు. బయట పేదోడికి కోవిడ్ వచ్చినా డాక్టర్లు రారు. కానీ, కేసీఆర్ ఫాంహౌజ్‎లో కుక్కకి సుస్తీ అయినా అంబులెన్సులు వెళతాయి. కేసీఆర్ కుక్కకున్న విలువ, పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయింది. హైదరాబాద్‎లో వరదలొస్తే సీఎం రాలేదు. వరంగల్‎లో వరదలొచ్చి పేదల ఇండ్లు మునిగిపోయినయ్. సీఎం మాత్రం హైదరాబాద్ దాటి రాలేదు. ఆర్టీసీ కార్మికులు చస్తే కనీసం స్పందించలేదు. మూర్ఖపు సీఎం కొడుకు నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు. పేదోళ్ల ఓట్లతో కేసీఆర్ గెలవలేదా? ఇది పేదల ప్రభుత్వం కాదా? మీకు పేదలు అక్కర్లేదా? 

టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ.. మజ్లిస్ తాలిబన్ పార్టీ
ఈ ప్రాంతానికి సింగూరు నీళ్లిస్తామని, తరువాత కాళేశ్వరం నీళ్లిస్తామని చెప్పి మాట తప్పి అంచనాలు పెంచి వేల కోట్లు కమీషన్లు దండుకుంటున్నడు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన టైగర్ నరేంద్ర సాబ్ నెల రోజులపాటు పాదయాత్ర చేసి సింగూరు జలాల కోసం పోరాడిన నాయకుడు. ఎన్నికలొస్తే కేసీఆర్ కోతలు కోస్తడు. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తడు. కానీ చేసేదేమీ ఉండదు. దళితులకు 3 ఎకరాలన్నడు. ఎంతమందికి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగమిస్తనన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తనన్నడు. కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటేనే దళితులను వంచించే పార్టీ. దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదు. ప్రగతి భవన్‎లో రూ.100 కోట్లతో రూములు కట్టుకున్నడే తప్ప, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. కేసీఆర్ అంటేనే తుగ్లక్. టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ. మజ్లిస్ పార్టీ తాలిబన్ పార్టీ.

కేంద్రం తెలంగాణకు వేల కోట్లు ఇస్తోంది
ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు? ఇక్కడ దళిత బంధు రావాలంటే ఇక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సిందే. ఈ మాట నేను కాదు, ప్రజలే అంటున్నరు. ఉప ఎన్నిక వస్తేనే రోడ్లు వస్తయి. నీళ్లు వస్తయి. పథకాలు వస్తయని జనం చెబుతుండ్రు. ఉద్యోగస్తులకు జీతాల్లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తాడట. 15 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తలేడు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వేల కోట్లు ఇస్తోంది. బియ్యం పైసలు కేంద్రానివే. ఒక్కో కిలోకు 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్రమే. కానీ ఫొటోలు మాత్రం కేసీఆర్‎వి పెట్టుకుంటున్నడు. బియ్యం, లైట్లు, రోడ్లు, చెట్లు, కమ్యూనిటీ హాళ్లు, నీళ్లు, టాయిలెట్ సహా చివరకు స్మశానవాటిక నిర్మాణాలకు పైసలిచ్చేది కూడా కేంద్రమే. పోతూపోతూ స్మశాన వాటికను చూశాను. ఒక్కో స్మశాన వాటికకు 11.13 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.4.23 లక్షలు, డంప్ యార్డ్‎కు రూ. 2.50 లక్షలు, నర్సరీకి 1.56 లక్షలు, రైతు వేదికలకు 10 లక్షలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే. స్వనిధి కింద యువకులకు రూ.10 వేలు ఇస్తోంది కూడా కేంద్రమే.

ఆంక్షల మధ్య హిందువులు పండుగలు నిర్వహించుకోవాలా?
తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, సమాజాన్నీ చీల్చే పార్టీ ఎంఐఎం. కేసీఆర్..!  నువ్వు నిఖార్సైన హిందువున్నవ్ కదా.. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నవ్? మండపాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? యువకులపై బైండోవర్ కేసులెందుకు పెడుతున్నవ్? ఆంక్షల మధ్య హిందువులు పండుగలు నిర్వహించుకోవాలా? నన్ను మతతత్వవాది అన్నా సరే... 80 శాతం హిందువుల కోసం బరాబర్ మాట్లాడతా. నా హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే నా లక్ష్యం. 

అధికారంలోకి వచ్చాక మీ కష్టాలన్నీ తీరుస్తం
ప్రజలారా... బీజేపీ మీ కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకు, మీ సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మీ సమస్యలన్నీ తీరుస్తాం. సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా నిర్మల్‎లో జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్న. కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతం. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్. కేసీఆర్ నియంత, కుటుంబ, అవినీతి పాలనను ఎండగట్టేందుకే పాదయాత్ర చేస్తున్నం. మీకోసం ఉద్యమాలు చేస్తున్నం. యువత, మహిళ, రైతుల కోసం పోరాడుతున్నం. బీజేపీని ఆదరించి.. ఆశీర్వదించండి’ అని బండి సంజయ్ అన్నారు.