బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉప్పల్ లోని చిలుకానగర్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఊడిపోయే పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కట్టాలని బండి సంజయ్ కోరారు. ఈ యాత్ర లో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, చిలుకానగర్ బీజేపీ అధ్యక్షుడు గోనే శ్రీకాంత్, హబ్సిగూడ, రామంతాపూర్ బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.