బీజేపీ ఎంపీలు, సీనియర్లంతా అసెంబ్లీకే..!

బీజేపీ ఎంపీలు, సీనియర్లంతా అసెంబ్లీకే..!

అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తున్నాయి. అన్ని పార్టీలకన్నా ముందే అధికార పార్టీ బీఆర్ఎస్​ క్యాండిడేట్ల ఫస్ట్​ లిస్ట్​ వారం రోజుల్లో విడుదలయ్యే చాన్స్​ కనిపిస్తున్నది. ఈ నెలాఖరుకే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల ఫస్ట్​ లిస్టు   ప్రకటించాలని అనుకున్నా కొన్ని కారణాలతో వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. బీజేపీ జాబితా ప్రకటన ఆలస్యమైనా.. సీనియర్ ​లీడర్లందరూ అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని ఆ పార్టీ హైకమాండ్​ ఇప్పటికే ఆదేశించింది. దీంతో బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్​చివరి వారంలో, లేదా నవంబర్ ​మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. 

బీజేపీ నుంచి లోక్​సభ సభ్యులుగా ఉన్న నలుగురితో పాటు సీనియర్​ నాయకులంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ​ఇప్పటికే  ఆదేశించింది. వీరి పేర్లతోనే మొదటి జాబితా ప్రకటించే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్​ వచ్చిన తర్వాతే తమ  క్యాండిడేట్ల లిస్ట్​ ప్రకటన ఉంటుందని బీజేపీ ముఖ్యులు చెప్తున్నారు. ఎంపీలు, సీనియర్​ లీడర్లు అసెంబ్లీకి పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండికేషన్​ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అంబర్​పేట నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ కరీంనగర్ ​లేదా వేములవాడ నుంచి, ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్​ లేదా కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ ​నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.  

మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మహబూబ్​నగర్, షాద్​నగర్​లో ఏదో ఒక చోటు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​భువనగిరి నుంచి, మాజీ ఎంపీ విజయశాంతి మల్కాజ్​గిరి ఎంపీ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి, బీజేపీ మధ్యప్రదేశ్​ వ్యవహారాల ఇన్​చార్జ్​ మురళీధర్ ​రావు మల్కాజ్​గిరి లేదా కూకట్​పల్లి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేలుగా ఉన్న ఈటల రాజేందర్ (హుజూరాబాద్), రఘునందన్​ రావు (దుబ్బాక) నుంచే పోటీ చేయనున్నారు. రాజాసింగ్​సస్పెన్షన్​ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో గోషామహల్​అభ్యర్థిత్వంపై డైలమా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నేతలంతా ఆయా నియోజకవర్గాల్లోని  కేడర్​తో  సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు.