
- వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య తెలంగాణ సాధిస్తం
- వడ్లు కొనబోమని సీఎం అన్నడు.. మెడలు వంచి కొనిపిస్తున్నం
- కేసీఆర్కు దళితులన్నా, అంబేద్కర్ అన్నా గౌరవం లేదు
- దళితులకు మూడెకరాలు ఇచ్చుంటే కోటీశ్వరులు అయ్యేటోళ్లు
- గద్వాల జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం
- అవినీతి సీఎంను ఇంటికి పంపాలె: వివేక్ వెంకటస్వామి
గద్వాల, వెలుగు: అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్గడీలు బద్దలు కొడుతామని, కుటుంబ పాలనను తరిమికొడుతామని చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించేందుకే బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర చేపట్టిందని చెప్పారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర గురువారం అలంపూర్లో ప్రారంభమైంది. తొలిరోజు బండి సంజయ్ నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇమాంపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో రాత్రి నిద్ర చేశారు. అంతకు ముందు జోగులాంబ అమ్మవారికి పూజలు చేసి అలంపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్కు దళితులన్నా, అంబేద్కర్ అన్నా గౌరవం లేదని విమర్శించారు.అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కూడా బయటకు రాడని, దళితులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేశాడని ఆరోపించారు. బీజేపీ అలా కాదని, అంబేద్కర్ జయంతి రోజే రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ చెప్పేటోడే.. చేసేటోడు కాదు..
ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి గుడి అభివృద్ధిని కేసీఆర్ విస్మరించాడని, ఆయనకు అమ్మవారంటే భయం లేదని సంజయ్ అన్నారు. ‘‘కేసీఆర్.. నువ్వు ఈ నడిగడ్డ మీద పాదయాత్ర చేసినవ్.. కానీ ఆర్డీఎస్ను ఎందుకు ఆధునీకరించలేదు.. ఆలంపూర్లో కనీసం బస్టాండ్ లేదు. కాలేజీ లేదు.. హాస్పిటల్ లేదు.. ఇక్కడి వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్కనున్న కర్నూల్పోతున్నరు. కేసీఆర్ చెప్పేటోడే తప్ప ఏ పనీ చేయడు’’ అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందని, ప్రజలు కోరుకుంటున్నవన్నీ అమలు చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ప్రజలను ఎలా వంచిస్తున్నాడో వివరించేందుకే ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.
రైతులకు పైసా ఇయ్యలే
వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పాడని, కానీ ఆయన మెడలు వంచి వరి కొనిపిస్తామన్న ప్రకటన చేయించిన ఘనత బీజేపీకే దక్కుతుందని సంజయ్ అన్నారు. ‘‘ఓసారి సన్న వడ్లు వేయవద్దంటడు. ఓసారి దొడ్డు వడ్లు వేయవద్దంటడు. పత్తి వేయవద్దంటడు. మొన్నటి దాకా క్వింటాల్కు రూ.5 వేలు ఉన్న పత్తి ఇయ్యాల రూ.10 వేలు అయింది. మిర్చి రేటు కూడా పెరుగుతోంది. ఈ ఘనత మోడీది కాదా?’’ అని ప్రశ్నించారు. రైతులకు ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం.. గడిచిన ఏడేండ్లలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికలు వస్తేనే హామీలతో మైమరిపించడం, తర్వాత మరిచిపోవడం సీఎంకు అలవాటేనని సంజయ్ విమర్శించారు.
దళితులకు మూడెకరాలు ఎందుకియ్యలే?
‘‘అంబేద్కర్కు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు అవమానించింది. కానీ ఆయన జన్మించిన, గతించిన, నడయాడిన ప్రాంతాలను పంచతీర్థాల పేరుతో బీజేపీ అభివృద్ధి చేస్తోంది. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత మా పార్టీకే దక్కుతుంది” అని సంజయ్ తెలిపారు. దళితులకు మూడెకరాలు ఎందుకియ్యలేదో, దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తే ఇప్పటికే కోటీశ్వరులు అయ్యేవాళ్లన్నారు. దళితబంధు కూడా అందరికీ ఇస్తాడనే నమ్మకం లేదన్నారు.
ఢిల్లీలో కేసీఆర్ను ఎవ్వరూ దేకలే: విజయశాంతి
ఢిల్లీలో కేసీఆర్ను ఎవ్వరూ దేకలేదని, దీంతో ఆయనకు చిప్పు దొబ్బిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి విమర్శించారు. ఢిల్లీలో దీక్ష చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో పెట్టె బేడ సర్దుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చాడన్నారు. వరి వేస్తే ఉరి అనడంతో చాలా మంది రైతులు వేయలేదని, వరి వేసిన కొందరి నుంచి కూడా కేసీఆర్ వడ్లు కొనలేదన్నారు. బీజేపీ పోరాటంతో దిగివచ్చి వడ్లు కొంటున్నాడని చెప్పారు. ఇప్పటికే దళారులకు అగ్గువకు వడ్లు అమ్ముకొని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాళా తీసిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలిచావులు, ఆత్మహత్యలు తప్పవన్నారు.
నియంతృత్వం మట్టిలో కలుస్తది: ఈటల
భవిష్యత్తు అంతా బీజేపీదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అగ్గి రగిలిందని, దాన్ని ఆపే శక్తి కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యం సీసాలను లేదన్నారు. నియంతృత్వం త్వరలోనే మట్టిలో కలుస్తుందని, తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.
టీఆర్ఎస్కు రాజకీయ సమాధే: లక్ష్మణ్
రాష్ట్రంలో టీఆర్ఎస్కు రాజకీయ సమాధి కట్టేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్అనడం, అంబేద్కర్ను అవమానించినట్లేనన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్ ఇయ్యాలన్నా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదని, జీవో ద్వారా దళితులకు 18 శాతం రిజర్వేషన్లు, ఆదివాసులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పారు.
కేసీఆర్ను గద్దె దించాలె: డీకే అరుణ
‘‘కేసీఆర్ను గద్దె దించుతామని జోగులాంబ అమ్మవారి సాక్షిగా ఆన తీసుకోవాలి.. కేసీఆర్ గద్దె దిగితేనే మన బతుకులు మారుతాయి” అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా ఏ ఒక్క సమస్యా పరిష్కరించలేదన్నారు. కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. నడిగడ్డ పోరాటాల అడ్డా అని, నీళ్ల కోసం రాయలసీమ వాసులను ఎదుర్కొన్నామన్నారు. అలాంటి గడ్డ నుంచి టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని పిలుపునిచ్చారు.
అవినీతి సీఎంను ఇంటికి పంపాలె: వివేక్ వెంకటస్వామి
అవినీతి సీఎంను ఇంటికి పంపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ, ఆర్డీఎస్ ఆధునీకరణ పూర్తయితే ఆయకట్టుకు నీళ్లు అందేవన్నారు. కమీషన్ల కోసమే లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులను రూ.60 వేల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడం ద్వారా సింపతీ పొందాలని కేసీఆర్ చూశాడని, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో తమకే అర్థం కావట్లేదని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపిం చాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వివేక్ చెప్పారు.
బంగారు తెలంగాణ పేరుతో దోచుకుంటున్నరు: తరుణ్ చుగ్
అలంపూర్/గద్వాల, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ లంక కొట్టుకుపోతుందని అన్నారు. అలంపూర్లో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని, రెండో విడత 31 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని కేసీఆర్పై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ ముందుకు పోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజల గొంతుకగా మారిందని, ప్రతి ఒక్కరూ తమ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రతి బీజేపీ కార్యకర్త తన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని, ప్రజా సంగ్రామ యాత్ర ముగిసే నాటికి ప్రధాని మోడీ ఆశీస్సులతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం స్తుందన్నారు.