వలసలు నిరూపిస్తే రాష్ట్రం వదిలిపోతవా?
కేసీఆర్కు సంజయ్ సవాల్
మహబూబ్నగర్, వెలుగు : పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టారని, కక్ష సాధిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పాలమూరులో వలసలు ఉన్నాయని, దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘‘ఒక వేళ నేను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపిస్తే కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ వదిలిపోతుందా? నా సవాల్కు కేసీఆర్ సిద్ధమా?’’ అని ఆయన ప్రశ్నించారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ‘‘2009 ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా గెలిచి, 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యి పాలమూరుకు కేసీఆర్ ఏం చేసిండు. సీఎంగా ప్రమాణం చేసి, పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి, వేల కోట్లను నాశనం చేసిండు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు స్కీంలను గాలికి వదిలేసిండు. అలంపూర్ నుంచి పాలమూరు దాకా పాదయాత్ర చేస్తుంటే మొత్తం రాళ్లు తప్ప, ఎక్కడా చెట్టు కూడా కనిపించలె. ఉమ్మడి పాలమూరును మొత్తం ఎడారిని చేసిండు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ వైఖరిపై ఏపీ, కర్నాటక ప్రభుత్వాలు నవ్వుకుంటున్నాయన్నారు. కేసీఆర్ సహకరిస్తే ఆరు నెలల్లో ఆర్డీఎస్ను ఆధునీకరించి చూపిస్తామని చెప్పారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా ఉంది. కానీ 2014 ఎన్నికల తర్వాత అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్ అమ్ముడుపోయాడు. తెలంగాణకు 299 టీఎంసీలే సరిపోతాయని ఒప్పుకొని ఫైల్పై సంతకం చేసిండు. రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే జీవో 69 ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇందుకు కేసీఆర్ మనసు ఒప్పడం లేదు” అని అన్నారు. అమరవీరులకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలన్నారు. బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపురావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్రావు, నాయకులు కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కేబినెట్లో ఉద్యమకారులేరి? : కిషన్రెడ్డి
‘‘ఎన్నికలు అంటే ఫామ్హౌస్ సీఎం కేసీఆర్ భయపడుతున్నడు. ఆయన కొడుకును సీఎంగా చూడలేకపోతానేమోనని నిద్ర కూడా పోతలేడు. దుబ్బాక, హుజూరాబాద్లో మాదిరిగానే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు’’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బంధీ అయిందన్నారు. రాష్ట్ర కేబినెట్లో ఉద్యమకారులు లేరని, తెలంగాణ ద్రోహులు మాత్రమే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్కు వెళ్లడానికి ప్రజలకు పర్మిషన్ ఉండదని, అదే ఎంఐఎం లీడర్లకు మాత్రం బైక్లపై కూడా ప్రగతి భవన్, కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రగతిభవన్ను తెలంగాణ ప్రజా భవన్ గా మారుస్తామని చెప్పారు.
కేటీఆర్ మత్తులో మాట్లాడుతుండు : అర్వింద్
కేటీఆర్కు దమ్ముంటే కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధమా? అని ఎంపీ అర్వింద్ సవాల్ విసిరారు. ‘‘కేటీఆర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నడు. ఆయన మాటలు చూస్తే మత్తు ఎక్కువై మాట్లాడుతున్నట్లు అర్థమవుతున్నది. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిందని, అందులో రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ.1,68,648 కోట్లేనని కేటీఆర్ చెప్తున్నడు. అయితే కేంద్రం పథకాల కోసం రాష్ట్రానికి రూ.1,14,585 కోట్లు ఇచ్చింది. ఇవి కాకుండా వివిధ అభివృద్ధి పనులకు కలిపి మొత్తం రూ.3,94,000 కోట్లను తిరిగి కేంద్రం ఇచ్చింది. పేదల ఫ్రీ బియ్యాన్ని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న దొంగ కేటీఆర్” అని ఆయన దుయ్యబట్టారు.
పాలమూరు ఎంపీ ఎన్నడైన కనిపించిండా?: రఘునందన్
పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఎన్నడైన పాలమూరుకు వచ్చారా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. ఆయన పాలమూరులో ఇప్పటి దాకా మూడు సార్లే తిరిగిండని ఆరోపించారు. కర్నాటక ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కావాలని ఫోన్ చేస్తున్నట్లు కేటీఆర్ చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. బీదర్, రాయచూర్కు టీఎస్ ఆర్టీసీ వాళ్లు వెళ్లి ఎందుకు అక్కడి బంకుల్లో డీజిల్ పోయించుకుంటున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బలం లేని పార్టీ అని చెబుతున్న రేవంత్రెడ్డి.. కొడంగల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలన్నారు.