ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచింది

ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచింది
  • యాత్రపై కోర్టు తీర్పు రాష్ట్ర సర్కారుకు చెంపపెట్టు
  • బీజేపీ సభకు లేని పర్మిషన్ మునావర్ షోకు ఎట్లిచ్చిన్రు?
  • లిక్కర్ స్కాం నుంచి దృష్టి మళ్లించేందుకు ఎత్తులు: సంజయ్

హనుమకొండ, జనగామ, వెలుగు: ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే.. సీఎం కేసీఆర్ డైరెక్షన్​లో కొందరు అల్లర్లు సృష్టించి అడ్డుకునే కుట్రలు చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ ​బండి సంజయ్ అన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. శుక్రవారం ఉదయం జనగామ జిల్లా పామునూరు నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపడుతున్న యాత్రను ఆపేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అడ్డుకున్నా కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. కోర్టు తీర్పు కేసీఆర్​కు చెంపపెట్టులాంటిదన్నారు. ప్రజా సంగ్రమా యాత్ర శుక్రవారం హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి, నాగపురం, ఐనవోలు మీదుగా ఓరుగల్లుకు చేరుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్​లో బీజేపీ సభకు అనుమతి ఇస్తూ శుక్రవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నాగపురం వద్ద సంజయ్ మీడియాతో మాట్లాడారు.

శాంతిభద్రతలను సాకుగా చూపి బీజేపీ సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో కేసీఆర్​ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే యాత్రకు, సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. బీజేపీ సభకు పర్మిషన్​ లేదని చెబుతున్న పోలీసులు.. రాముడిని, సీతమ్మవారిని అవమానిస్తున్న మునావర్​ ఫారుఖీ షోకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. శనివారం జరిగే బహిరంగ సభకుపార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట గంగిడి మనోహర్​ రెడ్డి, బొడిగె శోభ, రావు పద్మ, కొండేటి శ్రీధర్, ఏనుగుల రాకేశ్ రెడ్డి, సంగప్ప, రాణిరుద్రమ తదితరులు ఉన్నారు.

కూనూరు, గర్మిళ్లపల్లిలో టెన్షన్.. టెన్షన్​ 

సంగ్రామ యాత్రను టీఆర్‌‌ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జఫర్​ఘడ్ మండలం కూనూరు, ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూనూరు గ్రామంలోకి వస్తుండగా టీఆర్​ఎస్​ కార్యకర్త చాగంటి రాజు ఒక్క సారిగా దూసుకువచ్చి బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని నెట్టివేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్​ చేయడంతో బీజేపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. గర్మిళ్లపల్లిలో టీఆర్​ఎస్ నాయకులు యాత్రను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఐనవోలుకు చేరుకున్న తర్వాత సంజయ్ అక్కడ మల్లికార్జునస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, పాదయాత్ర కొనసాగించారు. పున్నేలు మీదుగా బొల్లికుంట చేరుకున్నారు. శనివారం ఉదయం బొల్లికుంట వాగ్దేవి కాలేజీ నుంచి మామునూరు, నాయుడు పంపు, శంభుని పేట మీదుగా వరంగల్​ భద్రకాళి ఆలయానికి చేరుకోనున్నారు.