దాడి ముసుగులో సంఘ విద్రోహ శక్తుల కుట్ర ఉంది

దాడి ముసుగులో సంఘ విద్రోహ శక్తుల కుట్ర ఉంది

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది ఆవేశపూరిత చర్య కాదు.. ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని స్పష్టమవుతోందన్నారు.ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రశాంతంగా నిరసన తెలపాలనుకున్నరు.. కానీ వారి ముసుగులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఈ విధ్వంసకాండను పసిగట్టడంలో, నిరోధించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వేల మంది రైల్వే స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే... రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆర్మీ అభ్యర్థుల మాటున దుండగులు పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయిందని నిలదీశారు. ఆ యువకులను రెచ్చగొట్టిందెవరు? వారి వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి యువకులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఈ  ఆందోళనకు అగ్నిపథ్  స్కీంకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని... దేశభక్తి ఉన్న యువకులు భరతమాతకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించే గొప్ప పథకం అగ్నిపథ్  అని..ఆర్మీలో చేరాలనుకునే యువకులకు ఇదొక గొప్ప వరమన్నారు. ఈ విధ్వంసానికి అగ్నిపథ్ స్కీంకు ముడిపెట్టి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.