వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోండి.. ఈటలకు  ఓటేయండి

వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోండి.. ఈటలకు  ఓటేయండి

కరీంనగర్: హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని ఆయన చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ ఊరి ఓట్ల డబ్బాలు చూస్తే పువ్వు గుర్తు మాత్రమే ఉండాలని అన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండానే డబ్బులు పంచున్నారని, అవి తీసుకుని ఓటు ఈటల రాజేందర్‌‌కే వేయాలని కోరారు. సర్వే చేయిస్తే మొన్న ఈటలకు మద్దతు 62 శాతం ఉంటే ఈ రోజు 75 శాతానికి చేరిందని అన్నారు.

ఈటల గెలిచాక ఇక్కడ దర్శనం.. తర్వాత ఆయోధ్య రాముడి దర్శనానికి వెళ్తా

రామన్న పల్లి వాసులంతా రాముని వారసులని అన్న సంజయ్.. ఎవరికి వారు ఓట్లు వేయడమే కాకుండా మిగతా వారికి కూడా చెప్పి బీజేపీకి ఓటు వేయించి ఈటలను గెలిపించాలని కోరారు. ఈటల గెలిస్తే రామన్నపల్లి నుంచే విజయ యాత్ర మొదలపెడతామని ఆయన చెప్పారు. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి సాక్షిగా చెబుతున్నానని, ఈటల కచ్చితంగా గెలుస్తున్నారని అన్నారు. రాజేంద్రన్న గెలిచిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని.. నేరుగా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని చెప్పారు. ‘‘ఈటల రాజేందర్ భయంతో సీఎం కేసీఆర్ తెల్లవారు జామున నిద్రపోతున్నాడట. రోజు రోజుకు సర్వేలో ఈటల గ్రాఫ్ పెరుగుతోందని తెలిసి భయపడిపోతున్నాడు. ప్రతి సర్వేలోనూ పువ్వు, రాజేందర్ పేరు తప్ప మరొకటి లేకపోవడంతో ఆయనకు నిద్ర పట్టడం లేదు. హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఎన్నికల ముందు 100 మందికి ఇచ్చి.. ఎన్నికలయ్యాక ఇస్తామని ఎవరికీ ఇవ్వలేదు. పాస్ పోర్టు బ్రోకర్ కాబట్టి మోసం చేయడం ఆయనకు అలవాటు. చివరకు నా సంతకం పోర్జరీ చేసి నేనే సహాయం ఆపించానని ప్రచారం చేస్తే.. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయమంటే రాలేదు” అని బండి సంజయ్ అన్నారు.