కరీంనగర్: మళ్లీ చెబుతున్నా... కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ గొడవ ఘటనలో కరీంనగర్ జైలు నుంచి విడుదలైన 23 మంది బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ పనైపోయిందని, ఆయన జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి, జైలుకు పంపించిందన్నారు. జైలుకు పంపిస్తే తమ కార్యకర్తలు భయపడరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కొంత మంది పోలీసులు సీఎం మోచేతి నీళ్లు తాగి, సీఎంవో ఏది చెబితే అది చేస్తున్నారన్నారు. తమ కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని, ట్యాపింగ్ జరుగుతుందని డీజీపీ భయపడుతున్నారని ఆరోపించారు.
తమ కార్యకర్తలపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై ఇప్పటివరకు ఎందుకు కేసులు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. బీజేపీ నాయకులు పరామర్శిస్తే అరెస్ట్ చేస్తారు.. కానీ ఓవైసీని మాత్రం బోధన్ లో ప్రశాంతంగా తిరగనిస్తారు, ఇదెక్కడి న్యాయం అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి, వారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
For More News..