
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీపై రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. లాక్ డౌన్ అమలుకు తాము సహకరిస్తుంటే.. కేసీఆర్ మాత్రం పక్కగా రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారని, నిధులివ్వడం లేదంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ అమలులో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్స్కు సరైన సదుపాయాలు కల్పించడం లేదని, రేషన్ పంపిణీని సరిగ్గా చేపట్టడం లేదని అందులో పేర్కొన్నారు.
మోడీని టార్గెట్ చేస్తున్నడు
కేంద్రం నిధులివ్వడం లేదంటూ పదే పదే తప్పుడు ప్రచారం సాగిస్తూ తెలంగాణ ప్రజల్లో ప్రధాని మోడీపై వ్యతిరేక భావం పెంచేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో కూడా అలాంటి ఆరోపణలే చేస్తున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ సందర్భంలో రాష్ట్రానికి ప్రధాని మోడీ అండగా నిలుస్తుండగా కేసీఆర్ మాత్రం మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ రెండు నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి.. తనతోనే ప్రధాని అన్ని విషయాలు చర్చించినట్లుగా, తానిచ్చిన సలహాలనే ప్రధాని లాక్ డౌన్ సందర్భంలో అమలు చేస్తున్నట్లుగా కేసీఆర్ గంట సేపు మీడియా సమావేశం పెట్టి చెప్పుకున్నారని బండి సంజయ్ బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానితో పరిపాలన విషయాలపై ఇంటర్నల్గా మాట్లాడిన మాటలను కూడా కేసీఆర్ బయట ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
పేదలకు సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నరు
పార్టీ నాయకులు, కార్యకర్తలు రోజూ పేదలకు అన్నదానం, నిత్యావసర సరకుల పంపిణీ చేస్తున్న విషయాన్ని సంజయ్ హైకమాండ్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమాలను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాక్ డౌన్ వరకు తమ సేవలో మార్పు ఉండదని, ఆ తర్వాత కేసీఆర్ పాలనలోని లోపాలపై దూకుడును పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. దీనికి హైకమాండ్ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు కోరారు.