
- రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్.. నేడు (జూన్ 29) నోటిఫికేషన్.. రేపు (జూన్ 30) నామినేషన్లు, విత్ డ్రాకు చాన్స్
- పోటీలో బండి సంజయ్, అర్వింద్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ
- బీసీలకే చాన్స్?.. ఏకగ్రీవానికి మొగ్గు
- అనివార్యమైతే జులై ఒకటిన ఎన్నికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది. షెడ్యూల్లో భాగంగా అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సోమవారం నామినేషన్ల దాఖలుతోపాటు అదేరోజు విత్డ్రాకు అవకాశం కల్పించనున్నారు. జులై 1న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, ఒకేసారి తెలంగాణతోపాటు ఏపీకి కూడా కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నది.
బరిలో ఒక్కరే ?
బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి శోభ కరంద్లాజే హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నామినేషన్లకు అవకాశం ఉంటుంది. అనంతరం వాటి పరిశీలన, విత్ డ్రా కు చాన్స్ ఇస్తారు. ఒకే నామినేషన్ వస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఎవరైనా రెండో వ్యక్తి బరిలో ఉంటే వచ్చే నెల ఒకటిన ఎన్నిక ఉంటుంది. కాగా, పార్టీ కేంద్ర నాయకత్వం సూచించిన ఒక్కరే పోటీలో ఉంటారని, ఏకగ్రీవానికే అవకాశం ఎక్కువ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ రెండో నామినేషన్ పడితే వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే.. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఓటర్లుగా ఉంటారు.
బీసీలకే చాన్స్!
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్ లీడర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులోనూ బీసీలకే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పోటీలో కేంద్ర మంత్రి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదట్లో బండి సంజయ్ పేరు లేదు. తాను ప్రెసిడెంట్ రేసులో లేనని గతంలోనే ఆయన స్పష్టత ఇచ్చినా.. హైకమాండ్ ఆదేశిస్తే మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మహిళా కేటగిరీలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తున్నది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తున్నది. అయితే, రాబోయే లోకల్బాడీ, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.