బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం
  •     బీజేపీ మహబూబాబాద్​పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్​ 
  •     దేశం కోసం మరోసారి మోదీ రావాలి 
  •     ములుగులో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం

ములుగు, వెలుగు : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని మహబూబాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్​ అన్నారు. శుక్రవారం ములుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్​అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీతారాంనాయక్​తోపాటు క్లస్టర్​ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్​ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలన్నా

అణగారిన వర్గాల అభివృద్ధి జరగాలన్నా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. 2014 నుంచి 2024 వరకు పదేండ్ల  బీజేపీ పాలనపై ఎలాంటి అవినీతి మచ్చలేదన్నారు. మహబూబాబాద్​పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.  పార్లమెంట్​లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ​కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ బీజేపీ అంటేనే క్రమశిక్షణతో  కూడుకున్న పార్టీ అని, సాధారణ కార్యకర్త నుంచి ప్రధాని వరకు అందరూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారన్నారు. బీజేపీ గెలుపు కోసం కార్యర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. మహబూబాబాద్​పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్​రెడ్డి, అజ్మీర కృష్ణవేణి నాయక్

బీజేపీ యువ మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్, నాయకులు బానోతు దేవీలాల్, ప్రతాప్, అజ్మీర ప్రహ్లాద్, భూక్య రాజునాయక్​, భూక్య జవహర్​లాల్​నాయక్, బీజేపీ మండలాధ్యక్షుడు యాదగిరి, నాయకులు మద్దినేని తేజరాజు, గాదం కుమార్ ​తదితరులు పాల్గొన్నారు.