
వరంగల్ అర్బన్: బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం వరంగల్ ఎంజిఎంలో 50 బెడ్స్ తో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శనివారం ఎంజీఎం హాస్పిటల్ ను సందర్శించిన ఆయన.. ఎంజీఎంలో మరిన్ని వసతుల గురించి ఇటీవల సీఎం వచ్చినప్పుడు చాలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే పాడైన పాత 500 బెడ్స్ ను తీసేసి , కొత్త బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 200 కొత్త ఐసియూ బెడ్స్ కు ఇప్పటికే 100 బెడ్స్ ఎంజిఎంకు వచ్చాయని.. ప్రతి కోవిడ్ వార్డుకు ఒకరిని ఇంచార్జీని పెట్టామని చెప్పారు.
కరోనా ట్రీట్ మెంట్ లో 65 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని.. కోవిడ్ మానటరింగ్ కోసం ముగ్గురిని స్పెషల్ గా నియమించామని తెలిపారు. ఎంజిఎంలో మరణాలు ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి చివరి దశలో వచ్చిన వాళ్లే అన్నారు. 80 శాతం రికవరీ ఉందని.. అన్ని సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రజలు భయపడద్దని.. ఎంజిఎంను వాడుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.