కోకాపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై శుక్రవారం బీఎండబ్ల్యూ కారు నిలిచిపోవడంతో నగరానికి చెందిన ఓ వ్యక్తికి రిపేర్ ఖర్చుగా రూ.40 లక్షల బిల్లు వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ తేజ అనే ఆడిటర్ కొద్దిరోజుల క్రితం గర్భవతి అయిన తన భార్య, డ్రైవర్తో కలిసి బీఎండబ్ల్యూలో ప్రయాణిస్తుండగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిలిచిన వర్షపు నీటిలో అతని కారు చిక్కుకుపోయింది. అనంతరం తన బాధాకరమైన అనుభవాన్ని ఉదయ్ ట్విటర్లో పంచుకుంటూ.. "గర్భవతి అయిన నా భార్యతో అర్ధరాత్రి వాహనం కోసం వెయిట్చేయడం బాధాకరం" అని అన్నాడు. మరుసటి రోజు తన కారు రిపేర్ చేయడానికి రూ. 40 లక్షలు ఖర్చు అయినట్లు బాధితుడు వాపోయాడు. ఓఆర్ఆర్ వద్ద ఇంజినీర్ల బృందం చేసిన పొరపాటు వల్ల తాను భారీ మూల్యం చెల్లించుకున్నానని అన్నాడు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రభావం ఎంత అని ఆయన ప్రశ్నించారు.
Also Read :- కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే శ్రద్ధాంజలి
ఒక రాత్రి వర్షానికే కార్లు నీట మునుగి కోట్లలో నష్టం వస్తోంది. ఎస్ఎన్డీపీ అంటే ఇదేనా? అని ప్రశ్నించాడు. రోడ్డుపై నీటిని నాలాలోకి పంపడం ఇంజినీర్లు మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశాడు. అతని ట్వీట్స్పై యూజర్లు స్పందించారు. “మీలాంటి బాధితులు నష్టపరిహారం కోసం వినియోగదారుల కోర్టులలో కేసులు వేస్తే తప్ప, ప్రభుత్వం సమస్యలపై చర్య తీసుకోదు" అని ఒకరు, “ఇది చిన్న పొరపాటు కాదు. ఇది హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం. సాధారణ కాంట్రాక్టర్కే సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు’’ అని మరొకరు ఆరోపించారు. “నేను ఇలాంటి 100 కు పైగా స్థలాలను చూపించగలను, ఇది ఇంజనీర్ల నిర్లక్ష్యం. ప్రభుత్వం కూడా చాలా ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నామని చెబుతున్నప్పటికీ వాటిలో చాలా వరకు డిజైన్ లేకపోవడం, నాసిరకం ఫ్లైఓవర్లు ఉన్నాయి” అని మరొక ట్విటర్లో కామెంట్ చేశారు.