
- మరో పీఆర్వోగా మామిడాల శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్వో(పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)లుగా బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బొల్గం శ్రీనివాస్ సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్. మండల స్థాయి జర్నలిస్టు నుంచి ఎదిగిన బొల్గం శ్రీనివాస్.. ప్రస్తుతం వెలుగు పేపర్లో బ్యూరో చీఫ్ గా పని చేస్తున్నారు.
1996లో ఈనాడు పేపర్ లో లోకల్ రిపోర్టర్గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి శిక్షణ పొందారు. అనంతరం ఈనాడులో సూర్యాపేట, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్గా పని చేశారు. ఈనాడు తర్వాత సాక్షి పేపర్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల బ్యూరో ఇన్చార్జ్గా సేవలందించారు. హైదరాబాద్లో స్టేట్ బ్యూరోలోనూ పని చేశారు.
ఆ టైమ్లో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), ఆర్థిక శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల వార్తలను కవర్ చేశారు. సాక్షి తర్వాత వెలుగు పేపర్ ప్రారంభం నుంచి అక్కడే పని చేస్తున్నారు. ప్రస్తుతం వెలుగులో బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయన సీఎం పీఆర్వోగా నియమితులయ్యారు. ఇక మామిడాల శ్రీధర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర గత రెండేండ్ల నుంచి పర్సనల్పీఆర్ఓగా పని చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన శ్రీధర్.. గతంలో ఏబీఎన్లో పని చేశారు.