హైదరాబాద్: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. గురువారం (డిసెంబర్ 4) 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సౌదీలోని మదీనా నుంచి హైదరాబాద్ వస్తోన్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ లైన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలోని ప్రయాణికులను కిందకు దించి ఫ్లైట్లో తనిఖీలు నిర్వహించారు.
ALSO READ | ఒక్కరోజే 200 ఇండిగో విమానాలు రద్దు.. హైదరాబాద్ లో రద్దు అయిన విమానాల లిస్ట్ ఇదే..
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ ముమ్మురంగా తనిఖీలు చేసి.. విమానంలో ఎలాంటి అనుమానాస్పద, పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. దీంతో విమానంలో బాంబ్ పెట్టినట్లు వచ్చింది తప్పుడు సమాచారమరని అధికారులు ధృవీకరించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
