రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోరిస్ జాన్సన్

రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోరిస్ జాన్సన్

ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించడం కన్ఫాంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనంటూ ఓవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెబుతున్నా... మరోవైపు రష్యన్ సేనలు ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. పుతిన్ ఒక్క మాట చెబితే చాలు.. ఉక్రెయిన్ పై దండయాత్రకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

అంతేకాదు, తన యుద్ధ కార్యాచరణలో భాగంగా ఉక్రెయిన్ లోని రెండు భూభాగాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రష్యాపై బ్రిటన్ ఆంక్షలకు తెరలేపింది. 5 రష్యన్ బ్యాంకులు, ముగ్గురు రష్యా కుబేరుల కార్యకలాపాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది.  

దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. రష్యన్ కంపెనీలు తమ దేశంలో నిధులు సేకరించడాన్ని తాము నిలిపివేయాలనుకుంటున్నామని చెప్పారు. స్టెర్లింగ్, డాలర్.. ఇలా ఏ కరెన్సీ రూపేణా బ్రిటన్ మార్కెట్లో వారికి నిధులు అందనివ్వబోమని స్పష్టం చేశారు. ఇక్కడి ఆస్తులపై రష్యా కంపెనీల యాజమాన్య హక్కులను తొలగించడంపై ఆలోచిస్తున్నామని వివరించారు. పుతిన్ తీసుకునే తదుపరి నిర్ణయాలను బట్టి తాము ఇంకా కఠినమైన ఆంక్షలు విధించే అవకాశముందని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఆఫ్గాన్కు భారత్ ఆపన్నహస్తం