
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళలతో పార్లమెంట్ దద్దరిల్లింది. సోమవారం (ఆగస్ట్ 11) ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాయి.
బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. స్పీకర్ సముదాయించే ప్రయత్నం చేసిన విపక్షాలు వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పార్లమెంట్ ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు.. ఓట్ల చోరీ జరుగుతుదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నుంచి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొననున్నారు. అయితే, ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీల ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది.