చెలరేగిన బౌలర్లు.. ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ

చెలరేగిన బౌలర్లు.. ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ

కాన్‌‌బెర్రా: ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ తొలి విక్టరీ కొట్టింది. మూడో వన్డేలో 13 రన్స్ తేడాతో గెలుపు రుచి చూసింది. వన్డే సిరీస్‌‌ను చేజార్చుకున్నప్పికీ టీ20 సిరీస్ ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ‌‌‌తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్), రవీంద్ర జడేజా (66 నాటౌట్), విరాట్ కోహ్లీ (63) రాణించారు. ముఖ్యంగా 152కు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో టీమిండియాను పాండ్యా, జడేజా ఆదుకున్నారు. ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

అనంతరం కంగారూ టీమ్ లక్ష్య ఛేదనకు దిగింది. తొలి రెండు మ్యాచుల్లో రాణించిన మార్నస్ లబుషేన్‌‌ను అరంగేట్ర బౌలర్ తంగరసు నటరాజన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌‌ను శార్దూల్ ఠాకూర్ బోల్తా కొట్టించాడు. ఆరోన్ ఫించ్ (75), అలెక్స్ క్యారీ (38), గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ (59) రాణించారు. కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చడానికి మ్యాక్స్‌‌వెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతడ్ని చక్కటి యార్కర్ డెలివరీతో బుమ్రా పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. చివరి రెండు వికెట్లను ఠాకూర్, బుమ్రా తీసి విక్టరీ అందించారు.