
నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా వెలకట్టలేని నాన్న ప్రేమకు, త్యాగానికి ఆరోజు( జూన్ 15) మనసారా అభినందనలు తెలుపుదాం.
వేలు పట్టుకుని నడక నేర్పించినా.. గాల్లోకి ఎగరేసి, పడకుండా పట్టుకున్నా.. అమ్ములూ.. అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పినా.. అమ్మకు తెలియకుండా ఐస్క్రీమ్ తినిపించినా.. ధైర్యంగా బైక్ కీ ఇచ్చి నడుపు అంటూ వెనకాల కూర్చున్నా.. ఇలాంటివన్నీ ఆలోచించకుండా చేయగల ఒకే ఒక వ్యక్తి నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత. నాన్నంటే రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. ఫాదర్ ఈజ్ రియల్ హీరో.. అలాంటి నాన్నకు కృతజ్ఞతలు తెలిపే ఫాదర్స్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ మూడో ఆదివారం ( జూన్ 15) జరుపుకుంటారు. చిన్నారులు ఆప్యాయంగా ఫాదర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ.. గిఫ్ట్ లిచ్చేందుకు రెడీ అవుతున్నారు.
పిల్లలను మంచి పౌరులుగా మార్చే లక్ష్యసాధనలో తన జీవితాన్ని సమిధగా చేస్తాడు. నాన్న, ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే, తన బిడ్డల్ని గమ్యాన్ని చేర్చేందుకు ముందుకు సాగే అలుపెరగని రథసారథి. బడిలో గురువులు పాఠాలు నేర్పిస్తే... బతుకు పోరాటం నేర్పించే గురువు నాన్నే. బిడ్డల లోపాలు సరిచేసి వారి భవితకు చక్కటి పునాది వేస్తాడు. ఆధునిక యుగంలో పిల్లల చదువు కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాడు. దాంతో తండ్రులు రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నారని బ్రెయిన్లీ సర్వే తాజాగా వెల్లడించింది.
ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద పీర్ టుపీర్, బ్రెయిన్లీ సంస్థ తండ్రి. పిల్లల బాంధవ్య క్రియాశీలతలను తె లుసుకునేందుకు ప్రత్యేకంగా పిల్లల విద్యపై తండ్రి పాత్ర అన్నదానికి అంచనాకు వచ్చేందుకు ఓ సర్వే నిర్వహించింది. ఇందులో హైదరాబాద్ మహానగ రానికి చెందిన ప్రతి ముగ్గురు తండ్రుల్లో ఒకరు తమ పిల్లల చదువుకు సహాయపడేందుకు రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నారని తేలింది. పిల్లల వ్యక్తిత్వం, దృష్టి కోణాన్ని రూపుదిద్దడంలో తండ్రినిర్వహించే కీలక పాత్రపై లోతుగా విశ్లేషించింది.
సర్వేలో చెప్పిందేమిటంటే
55 శాతం తండ్రులు తమ పిల్లల విద్యపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 45శాతం మంది పిల్లలకు పుస్తకాలు, నోట్స్ ఉపయోగిం చాలని సూచిస్తున్నారు. 30శాతం మంది ఆన్లైన్ వేదికలైన బ్రెయిన్లీ వంటివి సూచించారు.
ప్రత్యామ్నాయ ఆన్ లైన్ విద్యా పద్ధతులు, వాటి ఉపయోగంపై ఎక్కువమందికి అవగాహన ఉందని తెలిసింది. సర్వేలో ప్రతి ముగ్గురు భారతీయ తండ్రులలో ఒకరు తమ పిల్లలకు చదువులలో సహాయపడడానికి రాత్రిళ్ళు పొద్దు పోయే వరకు మేల్కొంటున్నారని కూడా తెలిసింది. సర్వే చేసిన విద్యార్థుల్లో 35 శాతం కంటే ఎక్కువ మంది తమ తండ్రులు రోజూ రాత్రి సహాయ పడుతున్నారని చెప్పారు.
30శాతం కంటే ఎక్కువమంది విద్యార్థులు వారంలో కొన్నిసార్లు తమ తండ్రులు ఆలస్యంగా పడుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లో , తండ్రులు తమ పిల్లల చదువులపై తల్లులతో సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నారని బ్రెయిన్ సీఈఓ మైకేల్సి బోర్ కౌస్కి పేర్కొన్నారు.
–వెలుగు,లైఫ్–