ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : మునుగోడులో క్యాండిడేట్‌‌‌‌ ఎవరైనా కాంగ్రెస్‌‌‌‌ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి, మునుగోడు ఉప ఎన్నికల ఇన్‌‌‌‌చార్జి రాంరెడ్డి దామోదర్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలంతా కో ఆర్డినేషన్‌‌‌‌తో పనిచేసి కాంగ్రెస్‌‌‌‌ గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వరంగల్‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌ పత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో లీడర్లు చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్‌‌‌‌ పాల్గొన్నారు.

మధ్యలోనే వెళ్లిపోయిన కృష్ణారెడ్డి.. అసహనం వ్యక్తం చేసిన లీడర్లు

చౌటుప్పల్‌‌‌‌లో సమావేశం జరుగుతుండగానే తనకు మరో మీటింగ్‌‌‌‌ ఉందంటూ చలమల్ల కృష్ణారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఆయన తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు దామోదర్‌‌‌‌రెడ్డితో పాటు మిగతా వారు మాట్లాడకముందే కృష్ణారెడ్డి వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. ఎన్ని మీటింగ్‌‌‌‌లు ఉన్నా సీనియర్‌‌‌‌ నాయకులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలన్నారు. దీంతో అక్కడే ఉన్న నేతలు కార్యకర్తలను సముదాయించి కూర్చోబెట్టారు. 
ఇక్కడి రైతులను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుతున్రు

సంస్థాన్‌‌‌‌నారాయణపురం, వెలుగు : తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించని కేసీఆర్‌‌‌‌ పంజాబ్, బీహార్‌‌‌‌లో మాత్రం పైసలు దానం చేస్తున్నారని కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌‌‌ నారాయణపురం మండలం గుడిమల్కాపురం, చిమిర్యాలలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలంతా కాంగ్రెస్‌‌‌‌ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో పాల్వాయి స్రవంతి, చలమల్ల నరసింహారెడ్డి, గడ్డం మురళీధర్‌‌‌‌రెడ్డి, ఒంగూరి సత్తయ్య, రాసమల్ల యాదయ్య పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే కేసీఆర్‌‌‌‌ దేశపర్యటన

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌ దేశ పర్యటన చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌ విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాని కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం భిక్షమయ్యగౌడ్‌‌‌‌ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా డైవర్ట్‌‌‌‌ చేసేందుకే రాష్ట్రాల పర్యటన చేస్తున్నారన్నారు. ఎన్ని రకాల డ్రామాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు భువనగిరి శ్యాంసుందర్, మండల ఇన్‌‌‌‌చార్జి రచ్చ శ్రీనివాస్, నాయకులు చిత్తర్ల కృష్ణ, చంద్రమౌళి, ఉదయ్ పాల్గొన్నారు. 

దీక్షలకు సంఘీభావం

రాజాపేట, వెలుగు : యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయాలని గ్రామస్తులు చేస్తున్న దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌‌‌‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. మండలం ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు రఘునాథపురానికి ఉన్నాయన్నారు. గ్రామస్తులు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌‌‌‌రెడ్డి, అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, రాజు, వినోద్, నగేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

దేవరకొండ, వెలుగు : దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 11, 12 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటిక నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని నాయినోనికుంటను రూ.4 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించారు. 12వ వార్డులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌ను ప్రారంభించారు. మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, పున్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

యాదాద్రి (ఆలేరు​), వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌ గెలుపు ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలేరులో పార్టీకి కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్‌‌‌‌ను విడిచి వెళ్లరని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్‌‌‌‌లో చేరిన వారికి కండువాలు కప్పారు. అనంతరం తుర్కపల్లిలో వీఆర్‌‌‌‌ఏలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వీఆర్ఏలకు సీఎం కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. వీఆర్ఏలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  మండల అధ్యక్షుడు ధనావత్‌‌‌‌ శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్‌‌‌‌రెడ్డి, ఎస్టీ సెల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌‌‌‌నాయక్‌‌‌‌ పాల్గొన్నారు.

నేడు మునుగోడుకు రేవంత్‌‌‌‌రెడ్డి రాక

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పీఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లో జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి పీసీసీ మాజీ చీఫ్‌‌‌‌, ఎంపీ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి, లీడర్లు కె.జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్‌‌‌‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌‌‌‌ మధుయాష్కిగౌడ్‌‌‌‌, ఎమ్మెల్యే సీతక్క కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ విడుదల చేసిన చార్జిషీట్‌‌‌‌ను వివరించనున్నట్లు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌ చెప్పారు. అయితే చండూరు సభకు దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ, స్టార్‌‌‌‌ క్యాంపెయినర్‌‌‌‌ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి ఈ మీటింగ్‌‌‌‌కు వస్తారా ? లేదా ? అన్న విషయంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన ఆసరా గుర్తింపుకార్డులను శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. పెన్షన్‌‌‌‌ పొందుతున్న ప్రతిఒక్కరూ రెండు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ గెల్లి అర్చన రవి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు కేఎల్‌‌‌‌ఎన్‌‌‌‌.రావు, జక్కుల వీరయ్య, కస్తాల శ్రవణ్, ఓరుగంటి నాగేశ్వరరావు, గాయత్రి భాస్కర్‌‌‌‌ పాల్గొన్నారు.