- మెదక్ రియల్టర్ హత్యలో పాత్రపై ఆరోపణలతో మనస్తాపం!
కూకట్పల్లి, వెలుగు: కొడుకును నీట్ఎగ్జామ్ రాయించడానికి మెదక్ నుంచి నగరానికి వచ్చిన ఓ డాక్టర్ కేపీహెచ్బీ కాలనీలో తాను బస చేసిన ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్, అనురాధ దంపతులు డాక్టర్లు. వీరు మెదక్ పట్టణంలో అనురాధ నర్సింగ్ హోం నడుపుతున్నారు. చంద్రశేఖర్ చిల్ర్డన్ స్పెషలిస్టు కాగా అనురాధ గైనకాలజిస్ట్. కొడుకు సోహాన్కు నీట్ఎగ్జామ్ రాయించడానికి ఆదివారం చంద్రశేఖర్తన భార్య అనురాధతో కలిసి నిజాంపేట వచ్చాడు. పరీక్ష అయిపోగానే కొడుకుని తీసుకుని ఇంటికి వస్తానని చెప్పి భార్యను మెదక్కు పంపించాడు. ఆ తర్వాత కేపీహెచ్బీలోని ఓ హోటల్లో రూమ్అద్దెకు తీసుకున్నాడు. రూంకు వెళ్లేటప్పుడే నిద్ర మాత్రలతో పాటు తాడు తీసుకువెళ్లాడు. పరీక్ష అయిపోగానే సోహాన్ తండ్రికి ఫోన్చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అనురాధ భర్తకి ఫోన్ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేసింది. హోటల్ సిబ్బంది వెళ్లి చూడగా రూం లోపల నుంచి లాక్వేసి ఉంది. సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాక్ పగులగొట్టి చూడగా చంద్రశేఖర్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మర్డర్ కేసు భయంతోనేనా?
మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక మర్డర్విషయంలో చంద్రశేఖర్పై ఆరోపణలు రావడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూనే కొంతకాలంగా ఆయన రియల్ ఎస్టేట్వ్యాపారం చేస్తున్నాడు. మెదక్లో రియల్ఎస్టేట్వ్యాపారం చేసే కటిక శ్రీనివాస్తో చంద్రశేఖర్కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. పోయిన నెలలో శ్రీనివాస్ను వెల్దుర్తి మండలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారులోనే హత్య చేసి పెట్రోల్ పోసి తగుల బెట్టారు. కటిక శ్రీనివాస్ హత్యలో చంద్రశేఖర్ ప్రమేయంపైనా ప్రచారం జరిగింది. పోలీసులు శ్రీనివాస్హత్య కేసులో ప్రాథమిక సమాచారం ప్రకారం.. అయిదుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతోందని ఇటీవల ఎస్పీ తెలిపారు. మర్డర్ కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి ఆత్మహత్య చేసుకునేంత మిగతా కారణాలేమీ లేవని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.