టీవీల సినిమాలు చూసుట్ల టాప్ మనోళ్లే

టీవీల సినిమాలు చూసుట్ల టాప్ మనోళ్లే

హైదరాబాద్‌‌, వెలుగు:

దక్షిణాది రాష్ట్రాల్లో టీవీలో సినిమాలు చూసేటోళ్లలో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారట. టీవీ ప్రేక్షకుల్లో తమిళం, కన్నడ, మలయాళం మూవీస్ కంటే తెలుగు సినిమాలనే ఎక్కువ మంది చూస్తున్నరట. బ్రాడ్‌‌కాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బార్క్ ఇండియా) తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  నవంబర్ 2018 నుంచి 2019 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా వివిధ టీవీ చానళ్లలో ప్రసారమైన అన్ని భాషల సినిమాల స్క్రీన్‌‌ టైమ్‌‌(8,59,000 గంటలు)పై బార్క్‌‌ విశ్లేషణ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టీవీల్లో హిందీ సినిమాలు చూసేవారి సంఖ్య అత్యధికంగా 31 శాతం ఉండగా, ఆ తర్వాతి స్థానంలో16 శాతం వీక్షకులతో తెలుగు సినిమాలే రెండో స్థానంలో ఉన్నాయని తేలింది. తమిళ్‌‌ మూవీస్‌‌ కు10 శాతం, కన్నడ సినిమాలకు 6 శాతం, మలయాళం మూవీస్ కు3 శాతం వీక్షకులు ఉన్నట్లు వెల్లడైంది. అయితే, దేశవ్యాప్తంగా మ్యూజిక్‌‌ చానళ్లను చూసేవారి సంఖ్య మాత్రం 2 నుంచి 4 శాతానికి మించడంలేదట.

సినిమాలు చూసేటోళ్లు 38%..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని చానల్స్‌‌లో 21 శాతం సమయంలో సినిమాలు టెలీకాస్ట్‌‌ అవుతుండగా, 79 శాతం సమయం ఇతర ప్రోగ్రామ్స్‌‌ ప్రసారమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 38 శాతం మంది వీక్షకులు సినిమాలు చూస్తుండగా, 62 శాతం మంది ఇతర ప్రోగ్రామ్స్‌‌ చూస్తున్నట్లు బార్క్‌‌ విశ్లేషణలో వెల్లడైంది. మెట్రోసిటీల విషయానికొస్తే టీవీల్లో సినిమాలు చూసేవారు అత్యధికంగా హైదరాబాద్‌‌లో 8.8 శాతం ఉండగా, చెన్నైలో 6.6 శాతం, బెంగళూరులో 6.20 శాతం మంది ఉన్నారు. హెచ్‌‌డీ చానళ్లు సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నవారిలో హైదరాబాద్‌‌లో17.80 శాతం మంది, చెన్నైలో 22 శాతం, బెంగళూరులో16. 82 శాతం మంది ఉన్నారు.