- రెండో రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు..
- తొలిసారి సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్
- హరీశ్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే నిర్ణయం
- ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారని టాక్
- ‘ఉపాధి హామీ’పై మాట్లాడకుండా బీజేపీకి సహకరించారని బీఆర్ఎస్పై మంత్రుల ఫైర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ఊహించని మలుపు తిరిగాయి. ప్రజా సమస్యలపై.. ప్రధానంగా కృష్ణా–గోదావరి జలాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగుతుందని అంతా అనుకున్న సమయంలో.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమావేశాలను బాయ్కాట్ చేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలిరోజే సమావేశానికి వచ్చి.. వెంటనే వెళ్లిపోగా.. రెండో రోజే బీఆర్ఎస్ సభ్యులంతా సభను బహిష్కరించడం చర్చనీయాంశమైంది.
హరీశ్రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. హరీశ్కు మైలేజ్ రాకుండా కేసీఆర్ ఇలా చేశారనే డిస్కషన్ నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ‘బాయ్కాట్’ చేయడం ఇదే తొలిసారి. తమకు స్పీకర్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. అందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అనంతరం గన్పార్క్ దగ్గర సమావేశాలను బాయ్కట్ చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిరోజు సభలో 3 నిమిషాలు మాత్రమే ఉండి సంతకం చేసి ఫాంహౌజ్కు వెళ్లిపోయారు. అదే సమయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీశ్రావు గోదావరి, కృష్ణా జలాలపై చర్చలో పాల్గొంటారని అంతా భావించారు. అయితే, కృష్ణా జలాలపై చర్చ బీఆర్ఎస్కు మైనస్గా మారుతుందనే సమావేశాలను ఆ పార్టీ సభ్యులంతా బాయ్కాట్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ఒకవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడం, ప్రజా సమస్యలపై సభలో గళం వినిపించాల్సిన ప్రతిపక్ష సభ్యులు సైతం కీలక సమయాల్లో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కేసీఆర్ గైర్హాజరీతోపాటు పార్టీ మొత్తం సభ నుంచి ‘పీచేముడ్’ అనడం వ్యూహా త్మక నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలకు సమాధానం ఇయ్యలేకేనా?
రాష్ట్రానికి జీవనాధారమైన కృష్ణా, గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణపై సభలో కీలకమైన చర్చ జరగాల్సి తరుణంలోనే బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది. నీటి పారుదల రంగంపై చర్చ జరిగితే.. గత పదేండ్లలో ప్రాజెక్టుల రీడిజైనింగ్, జలాల కేటాయింపులు, కేఆర్ఎంబీ పరిధిలోని అంశాలపై తమ తప్పిదాలు బయటపడుతాయనే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా దూరంగా ఉందనే చర్చ నడుస్తున్నది. సభలో ఉండి మాట్లాడటం కంటే, బయట ఉండి నిరసన తెలపడమే మేలని ఆ పార్టీ భావించినట్లు తెలుస్తున్నది.
జలాల అంశం సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి, సభలో జరిగే చర్చ తమకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారొచ్చన్న దూరదృష్టితోనే ఎమ్మెల్యేలను కేసీఆర్ తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాత్రపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. ఆయనకు ఇటీవలే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. అయితే, సాగునీటి రంగంపై అపార అనుభవం ఉన్న ఆయనకు సభలో మాట్లాడే అవకాశం దక్కలేదు.
జలాల అంశంపై హరీశ్రావు మాట్లాడితే ప్రభుత్వం ధీటుగా బదులిచ్చే అవకాశం ఉందని లేదా ఆయనకు మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ కట్టడి చేసి ఉంటారని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. హరీశ్ రావుకు స్వేచ్ఛనిస్తే చర్చ మరోలా ఉండేదని, కానీ అధినేత వ్యూహంలో భాగంగానే ఆయన మౌనంగా బయటకు రావాల్సి వచ్చిందని, కేసీఆర్ చివరి నిమిషంలో హరీశ్రావుకు ‘హ్యాండ్’ ఇచ్చారని చర్చ నడుస్తున్నది. ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై చర్చలో కూడా బీఆర్ఎస్ సభ్యులు పాల్గొనలేదు.
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యుల నిరసన
శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు నిరసనగా సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద బైఠాయించి, నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దేశమంతా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టి తిరుగుతుంటే, తెలంగాణ అసెంబ్లీలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం సభలో బాడీ షేమింగ్ చేస్తూ, వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. బీఏసీలో సభను 7 రోజులపాటు నడపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, మినిట్స్లో మాత్రం సభ వ్యవధిని స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు.
