- పద్మారావుగౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్
- క్యామ మల్లేశ్కు భువనగిరి.. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి
- మొత్తంగా16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్.. పెండింగ్లో హైదరాబాద్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 3 ఎంపీ సీట్లకు బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. సికింద్రాబాద్ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉంటారని ఆయన తెలిపారు.
ఈ మేరకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకులతో కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో వేర్వేరుగా భేటీ అయ్యారు. సికింద్రాబాద్ నుంచి పోటీకి పద్మారావుగౌడ్ సుముఖంగా లేనప్పటికీ.. కేసీఆర్ ఆయనను ఒప్పించినట్టు తెలుస్తున్నది. భువనగిరి సీటును దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ ఆశించగా, క్యామ మల్లేశ్కు కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు.
నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, చెరుకు సుధాకర్ వంటి నేతల పేర్లు వినిపించినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మూడింటితో కలిపి ఇప్పటివరకూ 16 సీట్లకు కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్క హైదరాబాద్ సీటు మాత్రమే పెండింగ్లో ఉన్నది. తమ మిత్రపక్షంగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో ప్రతిసారి ఇక్కడ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ కాంపిటీషన్లో పాల్గొంటున్నది.
12 మంది కొత్తోళ్లు
బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక మాజీ ఎంపీ ఉన్నారు. మిగిలిన 12 మంది తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వీరిలో సగం మందికి ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో చట్ట సభల్లో పనిచేసిన అనుభవం ఉన్నది. ఇంకో సగం మందికి ఆ అనుభవం కూడా లేదు. కాగా, బీఆర్ఎస్ ఇప్పటివరకూ 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో ఐదుగురు బీసీలు ఉన్నారు.
హైదరాబాద్ సీటును కూడా బీసీలకే ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన నాగర్కర్నూల్, వరంగల్ సీట్లను మాదిగలకు, పెద్దపల్లి సీటును మాలలకు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఆదిలాబాద్ను ఆదివాసి వర్గానికి, మహబూబాబాద్ను లంబాడాలకు కేటాయించారు. మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, మల్కాజ్గిరి సీట్లను రెడ్లకు, కరీంనగర్ సీటును వెలమలకు ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో వారి ఆర్థిక బలాలను కేసీఆర్ ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.