BRS మాక్ అసెంబ్లీ.. 22ఏ జాబితాలో భూములు, ఇతర హామీలపై సెటైర్లు

BRS మాక్ అసెంబ్లీ.. 22ఏ జాబితాలో భూములు, ఇతర హామీలపై సెటైర్లు
  •  స్పీకర్​గా మాణిక్​ రావు.. మంత్రి ఉత్తమ్ పాత్రలో పల్లా.. 
  •     సభ నుంచి సస్పెన్షన్​ నేపథ్యంలో నిరసనగా కార్యక్రమం
  •     22ఏ జాబితాలో భూములు, ఇతర హామీలపై సెటైర్లు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సస్పెన్షన్​కు ​నిరసనగా  తెలంగాణ భవన్​లో ఆ పార్టీ నేతలు శనివారం మాక్​ అసెంబ్లీ నిర్వహించారు. తాము ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సభ నుంచి సస్పెండ్​ చేశారని ఆరోపిస్తూ.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలంతా ఈ మాక్​ అసెంబ్లీలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో అసెంబ్లీ సెటప్​ వేశారు.  పలువురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వివిధ రోల్స్​లో నటించారు.

స్పీకర్​గా జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు వ్యవహరించారు. సీఎం రేవంత్​ పాత్రలో తలసాని శ్రీనివాస్​ యాదవ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పాత్రలో గంగుల కమలాకర్, ఇరిగేషన్​ శాఖ మంత్రి పాత్రలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి నటించారు. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి దక్కాల్సిన నీళ్లు, పేదల భూములను 22ఏ జాబితాలో పెట్టడం వంటి అంశాలపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

ఇక, ప్రభుత్వ ప్రతినిధుల్లా మాక్​అసెంబ్లీలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పల్లా రాజేశ్వర్​ రెడ్డి, గంగుల కమలాకర్​కూడా ప్రభుత్వంపై వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయితే, ఈ మాక్​ అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్​ రావు పాల్గొన్నా.. వాళ్లు మాత్రం మాట్లాడలేదు. మిగతా ఎమ్మెల్యేలంతా తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో సీఎం రేవంత్​, మంత్రి ఉత్తమ్​, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చేసిన కామెంట్స్​ను ఇమిటేట్​ చేస్తూ మాక్​ అసెంబ్లీలో కామెంట్స్​ చేశారు. 

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​కు కౌంటర్​గా సీఎంగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్​ యాదవ్.. ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ వ్యాఖ్యానించారు. ఇటు నీళ్ల విషయంలో చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్​ చేసిన ‘ప్రిపేర్​ అయ్యి వస్తా’ అనే వ్యాఖ్యకు వ్యంగ్యంగా.. ‘నేను ప్రిపేర్​ అయ్యి రాలేదు. ప్రిపేర్​ అయినా రాదు’ అంటూ పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరా గాంధీ కట్టారంటూ సీఎం పాత్రలోని తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సెటైర్​ వేశారు. అంతేకాదు.. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాంగానీ.. ఏ వంద రోజులన్నది చెప్పలేదంటూ కాంగ్రెస్​ పార్టీని ఎద్దేవా చేశారు.