వర్ని, వెలుగు: తనతో పాటు తన కుటుంబం బాన్సువాడ నియోజకవర్గ ప్రజాసేవకే అంకితమవుతామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. స్పీకర్గా ఉన్న వ్యక్తి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడని అందరూ అనుకున్న సమయంలో తనను మళ్లీ గెలిపించి బాన్సువాడ ప్రజలు చరిత్ర తిరగరాశారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో శనివారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్తో కలిసి చందూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడమే లక్ష్యమని తెలిపారు. రూ.106.40 కోట్లతో చందూరు, జాకోరా, చింతకుంట ఎత్తిపోతల పథకాలను నిర్మించామని చెప్పారు. వీటితో 9 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రూ.258 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే మరో13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం చందూరులో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పీసీసీ డెలిగేట్ కూనిపూర్ రాజిరెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్సురేశ్బాబా, జిల్లా నాయకులు వెలగపూడి గోపాల్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
