
- కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్ల తరలింపు ఒక్కటే మార్గమన్నారు
- గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు
- ఆ నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రగతి భవన్లో, నగరిలో హామీ ఇచ్చారు
- కేసీఆర్ చెప్పిన గోదావరి నీళ్ల తరలింపుకే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు వ్యాఖ్య
- ప్రాజెక్టుపై అమరావతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నదని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు నీటి తరలింపుకు పూర్తి అండగా నిలబడ్డారు. ఇప్పుడేమో అదే రాయలసీమకు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తామంటే రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు” అని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన బనకచర్ల ప్రాజెక్టుపై అమరావతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాయలసీమకు నీటి తరలింపుపై నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆయన వివరించారు. నాటి కేసీఆర్ హామీ వీడియోలనూ ప్లే చేసి చూపించారు. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనూ గోదావరి జలాల వినియోగంపై కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో సీఎం చంద్రబాబు ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు తగ్గట్టు నీటి పంపకాలు చేసుకుందామని అనుకున్నారు. నాడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా గోదావరి నీళ్లను సమర్థంగా వాడుకుంటే మంచిదన్నారు.
కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల అవసరాలకు వెయ్యి టీఎంసీలు కావాలని ఆయన చెప్పారు. అంత నీరు కావాలంటే గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న 3వేల టీఎం సీల్లో అవసరమైన మేరకు సమర్థవంతంగా వినియోగించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని నాడు కేసీఆర్పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లో రికార్డెడ్గా కేసీఆర్ చెప్పిన గోదావరి జలాల తరలింపునే నేడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుగా రూపొందించి చేపడుతున్నారు’’ అని ఆయన వివరించారు.
అప్పుడు జగన్తో కేసీఆర్ చెప్పిందేంది?
రాయలసీమకు నీటి తరలింపుపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నాడు ఏపీ సీఎం హోదాలో జగన్ వెళ్లారు. నాడు ప్రగతిభవన్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. అలాగే నగరిలోని నాటి మంత్రి రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ఆ రెండు సందర్భాల్లోనూ రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతమని కేసీఆర్ చెప్పారు. గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించడం ఒక్కటే పరిష్కారమని కూడా చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే అదొక్కటే మార్గమన్నారు.
కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాజెక్టు అభ్యంతరకరమని బీఆర్ఎస్ నేతలు చెప్పడం ఎంతవరకు సమంజసం? నాడు ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావరి జలాల తరలింపు నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు రాయలసీమ పచ్చనిపైరుగా మార్చే బనకచర్ల ప్రాజెక్టుపై నాడునిర్ణయం తీసుకున్న తోటి నాయకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మాజీ సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదు?’’ అని రామానాయుడు ప్రశ్నించారు.