అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేదని కొన్ని రోజులుగా కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. పార్టీ ఓటమికి తామే కారణమని అనడం సరికాదన్నారు. పార్టీ ముఖ్యనేతల తీరుపై కూడా ప్రజల్లో ఆగ్రహం ఉందని..పదేళ్ల వ్యతిరేకత కూడా పార్టీ ఓటమికి కారణమంటున్నారు మాజీలు.
గెలిచిన చోట కేసీఆర్ గొప్పతనమని.. పార్టీ గొప్పతనమని.. ఓడిన చోట మాత్రం తమను తప్పుబట్టడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్న ప్రజలు పార్టీని ఎలా ఓడగొడతారని.. అసలు ఎన్నికల ముందు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ఎన్నికల్లో ఓటమిపై ప్రభావం చూపిందని అభిప్రాయపడుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు .
అయితే ఎన్నడూ లేని విధంగా పార్టీ నేతలు, కేటీఆర్, గానీ పార్టీ అధిష్టానంపై గానీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ పదేళ్లలో అసలు తాము ప్రగతి భవన్ చూడలేదని కొందరు..అసలు తెలంగాణ భవన్ కి రావాలంటే కూడా భయపడ్డామని బహిరంగంగానే తమ ఆవేదన చెబుతున్నారు. కేటీఆర్ సిరిసిల్ల వచ్చినప్పుడు కూడా తమను కలవనివ్వలేదని చెబుతున్నారు. అసలు పార్టీ నేతలు, తమ అభిప్రాయాలను చెప్పుకునే చాన్స్ ఒక్కసారి కూడా ఇవ్వలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు .