
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితా నుంచి తొలగించారు రెవెన్యూ అధికారులు. ఈ మేరకు చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి నోటీసులు అంటించారు రెవెన్యూ అధికారులు.
తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడైనని నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుండి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు వేములవాడలోని చెన్నమనేని రమేశ్ నివాసానికి నోటీస్ అందజేయడమే గాకుండా ఆయనకు రిజిస్టర్డ్ పోస్ట్ చేశారు అధికారులు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2 తేదీ లోగా సమాధానం ఇవ్వాలని తెలిపారు అధికారులు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు రెవెన్యూ అధికారులు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని 2024 డిసెంబర్ 9న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పౌరసత్వం కేసులో తప్పుడు ధృవపత్రాలతో కేసును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను 30 లక్షల జరిమానా విధించింది. అందులో రూ. 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు మొత్తం పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ ను ఆదేశించింది హైకోర్టు. 2009లో తప్పుడు ధృవపత్రాలతో గెలిచినట్లుగా చెన్నమనేని రమేష్ పై ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆదిశ్రీనివాస్ కేసు వేసిన విషయం తెలిసిందే.