ఖమ్మంలో కారు ఖాళీ!

ఖమ్మంలో కారు ఖాళీ!
  •     బీఆర్​ఎస్​కు బిగ్​షాక్.. కాంగ్రెస్​ కండువా కప్పుకున్న భద్రాచలం ఎమ్మెల్యే
  •     సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావ్​
  •     పంతం నెగ్గించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్​కు బిగ్ షాక్​తగిలింది. జిల్లాలో ఒక్కగానొక్క గులాబీ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ‘కారు’ ఖాళీ అయింది. ఆదివారం హైదరాబాద్​లో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావ్​ కాంగ్రెస్​లో చేరారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరినీ బీఆర్​ఎస్​ తరుఫున అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని ఎన్నికలకు ముందు శపథం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్​గా పంతం నెగ్గించుకున్నారు. 

అనుకున్నదే.. అయ్యింది!

పొంగులేటి శిష్యుడిగా ముద్రపడిన ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావు బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన నాటి నుంచే కాంగ్రెస్​ లో చేరుతారనే ప్రచారం జరిగింది. తెల్లం రాజకీయాల్లోకి వైసీపీ తరుఫున పొంగులేటి ద్వారా ఆరంగేట్రం చేశారు. తొలుత మహబూబ్​బాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్​ఎస్​లో చేరితే ఆయన వెంట నడిచారు. బీఆర్​ఎస్​నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పొంగులేటికి, బీఆర్​ఎస్​కు మధ్య వైరం పెరిగి ఆయన కారు దిగి కాంగ్రెస్​లో చేరారు. 

అప్పుడు  కూడా పొంగులేటి వెంటనే నడవాలని భావించిన తెల్లం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కానీ భద్రాచలం టిక్కెట్​ విషయంలో సిట్టింగ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్​ పొదెం వీరయ్యకే కాంగ్రెస్​ హైకమాండ్​ మొగ్గు చూపింది. దీంతో కాంగ్రెస్​లో చేరిన 40 రోజుల్లోనే తెల్లం తిరిగి బీఆర్​ఎస్​కు వెళ్లిపోయి టికెట్​ దక్కించుకున్నారు. 

తన రాజకీయ గురువు  పొంగులేటి మాటను కాదని వెళ్లినా ఎక్కడో మూలన అనుమానం లేకపోలేదు. ఒకవేళ ఆయన బీఆర్​ఎస్​ నుంచి గెలిచినా కాంగ్రెస్​కే వస్తారని ఆ రోజే పలు రకాలుగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 9 కాంగ్రెస్​ గెలిచింది. ఊహించని రీతిలో భద్రాచలంలో పొదెం వీరయ్య ఓటమి పాలయ్యారు. బీఆర్​ఎస్​ నుంచి తెల్లం వెంకట్రావ్​ గెలిచారు. ఆ నాటి నుంచే వెంకట్రావు కాంగ్రెస్​లో చేరికకు ముహూర్తంపై రోజుకో విధంగా ప్రకటనలు వచ్చాయి. 

బీఆర్​ఎస్​ కు దూరం.. కాంగ్రెస్​కు దగ్గర.. 

తెల్లం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరోక్షంగా ఆయన కాంగ్రెస్​కు దగ్గరవుతూ బీఆర్​ఎస్​ను దూరం పెడ్తూ  వచ్చారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు ఐటీసీ గెస్ట్ హౌస్​లో తెల్లం వెంకట్రావ్​ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు చేరికపై వచ్చిన ఊహాగానాలను ఆయన ఖండించారు. బీఆర్​ఎస్​లోనే ఉంటానని స్పష్టం చేశారు. కానీ మార్చి 1న  మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలు వెళ్తుంటే తెల్లం డుమ్మా కొట్టారు. 

హైదరాబాద్​లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి హాజరు కాలేదు. స్వయంగా కేటీఆర్​ ఆహ్వానించినా వెళ్లలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్​రెడ్డిని కుటుంబ సమేతంగా వెంకట్రావు కలిశాడు. ఈ విషయమై వెంటనే మాజీ మంత్రి హరీశ్​రావు ఉద్యమకారుడు, మాజీ నియోజకవర్గ ఇన్​చార్జ్ మానె రామకృష్ణను పిలిపించుకుని పరిస్థితిపై ఆరా తీశారు. నియోజకవర్గ ఇన్​చార్జ్ గా ఉన్న తెల్లంను తొలగించి మళ్లీ మానె రామకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఐదో గ్యారంటీ మీటింగ్​కు జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్​రెడ్డిని తెల్లం కలిసి మణుగూరు సభలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. 

అనంతరం ఖమ్మం,  చర్లలో జరిగిన బీఆర్​ఎస్​ సమావేశాలకు వెళ్లలేదు. ఎంపీ మాలోతు కవిత స్వయంగా వెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని కోరినా పట్టించుకోలేదు. తాజాగా ఇల్లెందులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి వెంకట్రావు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయానికి ఉన్న బీఆర్​ఎస్​ ఫ్లెక్సీలు తొలగించినప్పుడే ఆయన పార్టీ మారుతారని స్పష్టమైంది. తుక్కుగూడలో శనివారం జరిగిన రాహుల్​ గాంధీ సమావేశంలోనూ తెల్లం పాల్గొన్నారు. ఫైనల్​గా ఆదివారం ఉదయం సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.

అభివృద్ధే ఎజెండా : తెల్లం

నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్​ పార్టీలో చేరిన్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావు ప్రకటించారు. ఆదివారం పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నట్లుగా ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. వారి హామీ నెరవేర్చాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందని, అందుకే కాంగ్రెస్​ లో చేరానని తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, కేవలం అభివృద్ధే తన ఎజెండా అన్నారు.