ప్యాకేజీ ప్రకటించి చెల్లింపుపై హామీ ఇచ్చిన గత సర్కార్....కొండపోచమ్మ సాగర్‌‌ నిర్వాసితుల ఎదురుచూపు

ప్యాకేజీ ప్రకటించి చెల్లింపుపై హామీ ఇచ్చిన గత సర్కార్....కొండపోచమ్మ సాగర్‌‌ నిర్వాసితుల ఎదురుచూపు
  •   పెండింగ్ లోనే పరిహారం..
  • ఏండ్లుగా పరిహారం కోసం  ఆఫీసుల చుట్టూ తిరుగుతూ..
  • ఎప్పుడోస్తుందో తెలియని అయోమయంలో బాధితులు
  • ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి ఇవ్వాలంటూ వేడుకోలు

సిద్దిపేట/ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెగ్మెంట్ ములుగు మండల పరిధిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ముంపులో ఇండ్లు, భూములు కోల్పోయిన కొందరు నిర్వాసితులకు పెండింగ్ పరిహారం ఇంకా అందడంలేదు. ఏండ్లుగా బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మామిడ్యాల, బైలంపూర్, తానేదారిపల్లి, లంబాడితండా గ్రామాలకు చెందిన సుమారు 400 మందికి పలు రకాలైన పరిహారం పెండింగ్ లో ఉంది. 

ముంపు గ్రామాల్లో  కటాఫ్ డేట్ కు 18 ఏండ్లు నిండి పెండ్లి కాని యువతీ యువకులు, ఒంటరి మహిళలు, పురుషులకు  ఇంటి జాగా,  ఇంటి నిర్మాణానికి, జీవనోపాధికి ప్రత్యేక ఆర్థికసాయం రావాల్సి ఉండగా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఒకవైపు అధికారులు సమీక్షలు చేస్తున్నా పరిహారం అందించడంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

 గత ప్రభుత్వం ప్రకటించిన ముంపు గ్రామాల్లోని నిర్వాసితులైన198 మందికి ఫుల్ ప్యాకేజీ పెండింగ్ లో ఉంది. దీని కింద 250 గజాల జాగా, రూ. 7.50 లక్షలు, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అందాల్సి ఉంది.  మరో 110 మంది ఒంటరి మహిళలు, పురుషులకు ప్లాట్లు కేటాయించినా.. ఇంటి నిర్మాణానికి, జీవనోపాధికి ఆర్థికసాయం పెండింగ్ లోనే ఉంది. వీరితో పాటు న్యాయమైన పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన మరో 43 మంది పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. వీరంతా ఆర్అండ్ ఆర్ కాలనీలోని తాత్కాలిక నిర్మాణాల్లో ఉంటూ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. మరో 50 కుటుంబాలకు ఏదో ఒక పరిహారం ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో వారంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

 అధికారులు, మంత్రులకు విన్నవించినా.. 

నిర్వాసితులు  అధికారులు, మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సర్కార్ ను కలిసి విన్నవించుకున్నారు. మండల కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకంగా నిర్వాసితుల పరిహారం సమస్యపై మంత్రులకు వినతి పత్రాలను కూడా అందజేశారు.  త్వరలోనే అందిస్తామనే హామీలు ఇస్తున్నా ఎలాంటి కార్యచరణ చేపట్టడడంలేదు. దీంతో నిర్వాసితులు నిరాశలో ఉన్నారు. 

ఎలాంటి స్పందనలేదు  

గత ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ డేట్ వరకు 18 ఏండ్లు నిండినా.. నాకు ఇంకా ఎలాంటి పరిహారం అందలేదు. 250 గజాల ప్లాటు, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలతో పాటు జీవనోపాధికి ఆర్థిక సాయానికి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదు.  

- బబ్బూరి వెంకటేష్ గౌడ్, బైలంపూర్-

పరిహారం వెంటనే ఇవ్వాలి 

కొండ పోచమ్మ నిర్మాణంతో ముంపునకు గురై సర్వం కోల్పోయాం. అర్హులైన కొందరికి ఇంకా  న్యాయం జరగాల్సి ఉంది. పెండింగ్ పరిహారంపై ఏండ్లు గడుస్తున్నా ఇవ్వడంలేదు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇకనైనా వెంటనే స్పందించి పెండింగ్ పరిహారం వెంటనే ఇవ్వాలి.  

- తమ్మల శ్రీనివాస్, మామిడ్యాల

ప్రభుత్వానికి నివేదిక పంపాం

కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితుల పెండింగ్ పరిహారంపై గతంలోనే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఆదేశాలు రాగానే పంపిణీ పై చర్యలు తీసుకుంటాం. అర్హులైన నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తాం.    

 - చంద్రకళ, ఆర్డీవో గజ్వేల్