రెండు నెలల్లో రుణమాఫీ!.. 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు

రెండు నెలల్లో రుణమాఫీ!.. 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు
  • రెండు నెలల్లో రుణమాఫీ!.. 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు
  • ఎన్నికలు సమీపిస్తుండటంతో పాత హామీ ముందుకు..
  • హామీ నెరవేర్చకపోవడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు
  • ఇప్పటికీ 6 శాతం మందికే రుణమాఫీ
  • 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు
  • లోన్​ రీపేమెంట్​ కింద రైతుబంధు డబ్బులు కట్​ చేసుకుంటున్న బ్యాంకర్లు

హైదరాబాద్, వెలుగు: రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్టుగా ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కరోనా సాకుతో ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో లక్షల మంది రైతులు ఎగవేతదారులు(డిఫాల్టర్లు)గా మారారు. బ్యాంకర్లు లోన్​లు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. 

క్రాప్ లోన్లు మాఫీ చేయకుంటే రైతులంతా కారు పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం ఖాయమన్న సర్వే రిపోర్టులు, ఇంటెలిజెన్స్ నివేదికలతో ప్రగతి భవన్ వర్గాలు అలర్ట్​అయ్యాయి. సెప్టెంబర్ నెలాఖరుకే రైతుల లోన్లు మాఫీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. ఇందుకు అవసరమైన నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చినట్టుగా ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

ఆరు శాతం మంది రైతులకే మాఫీ

2018 డిసెంబర్​11 నాటికి ఉన్న పంట రుణాలను వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానూ సీఎం కేసీఆర్ ఇదే విషయం చెప్పారు. నాలుగేండ్లలోనే రైతులను రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్​తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు రూ.25,936 కోట్ల (రూ.లక్ష లోపు) రుణం ఉన్నట్టుగా నిర్దారించారు. ఒక కుటుంబంలో ఒక్కరికే ప్రయోజనం పేరుతో ఇందులో 3.98 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. 36.68 లక్షల మందికి చెందిన రూ.19,198.38 కోట్లు మాఫీ చేయాల్సి ఉందని లెక్కగట్టారు. 

ఇప్పటి వరకు 5.66 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. రూ.60 వేల వరకు రైతులు తీసుకున్న లోన్లు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. రూ.37 వేల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. రుణమాఫీ చేయాల్సిన వారిలో వీరి సంఖ్య 6 శాతం మాత్రమే. మిగతా లోన్లు మాఫీ చేయాల్సి ఉంది. ఈ రైతుల సంఖ్య భారీగా ఉండటంతో మాఫీ చేయకుంటే వారంతా రివర్స్​అయ్యే ప్రమాదముందని ప్రభుత్వానికి సంకేతాలు అందాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల హామీని నెరవేర్చకుండా మళ్లీ గెలవడం కష్టమని నిర్దారణకు వచ్చారు. ఈనేపథ్యంలో రుణమాఫీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

రైతులకు గుదిబండగా పంట రుణాలు

రైతుబంధు, బీమా, ఉచిత కరెంట్​ఇస్తున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు సర్కారుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి ఇలాగే ఉంటే రైతు కుటుంబాల ఓట్లు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరికలు అందాయి. ఆయా కుటుంబాలకు ఇతర పథకాలు అందుతున్నా పంట రుణాలు వారికి గుదిబండగా మారాయి. కొన్ని చోట్ల రైతుబంధు మొత్తాన్ని బ్యాంకర్లు పాత లోన్ల రీపేమెంట్​కింద కట్​చేశారు. ఇది కొంప ముంచుతుందనే భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా బ్యాంక్​అధికారులతో మాట్లాడి రైతుబంధు మొత్తాన్ని రైతులకు చెల్లించేలా ఒప్పించారు. 

కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే పుట్టి మునిగే ప్రమాదముందని చెప్పారు. సర్వేలు, ఇంటెలిజెన్స్​రిపోర్టులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని, ఆర్థికంగా ప్రతిబంధకాలున్నా రుణమాఫీ చేయడం వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. రుణమాఫీకి అవసరమైన రూ.20 వేల కోట్ల వరకు సొమ్ము సమకూర్చాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్తున్నారు.