ఎమ్మెల్యే చిన్నయ్య పై ..నో యాక్షన్​

ఎమ్మెల్యే చిన్నయ్య పై ..నో యాక్షన్​
  • ఎమ్మెల్యే చిన్నయ్య పై ..నో యాక్షన్​
  • లైంగిక వేధింపుల ఆరోపణలపై సర్కారు సైలెన్స్​
  • నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న సీఈవో  షేజల్​
  • చిన్నయ్యకు కేటీఆర్​ క్లీన్​చిట్​తో మనస్తాపం.. 
  • మూడోసారి సూసైడ్​ అటెంప్ట్​

మంచిర్యాల, వెలుగు:   ఆరిజిన్​ డెయిరీ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన బెల్లంపల్లి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సర్కార్​ ఈగ వాలనివ్వడం లేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తమ దగ్గర రూ.30 లక్షలు తీసుకొని మోసం చేశారని,  రైతులతో అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని,  పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ  ఆరిజిన్​ డెయిరీ సీఈవో షేజల్​ నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి హైదరాబాద్​లోని  తన ఫ్లాట్​లో,  మరోసారి ఢిల్లీలో  సూసైడ్​ అటెంప్ట్​ చేసిన ఆమె గురువారం హైదరాబాద్​లోని పెద్దమ్మ తల్లి టెంపుల్​ సమీపంలో నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం రేపింది.  దీంతో దుర్గం చిన్నయ్య వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసు డిపార్ట్​మెంట్​ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి మరోసారి రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

డెయిరీకి ఏర్పాటుకు సహకరిస్తానని మోసం..

హైదరాబాద్​లో నివాసముంటున్న  ఆదినారాయణ, షేజల్ నిరుడు బెల్లంపల్లిలో ఆరిజిన్​ డెయిరీ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సంప్రదించారు.  ఆయన తన బామ్మర్దికి వాటా ఇస్తే  డెయిరీకి సహకరిస్తానని చెప్పగా అందుకు ఒప్పుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీ శివారులో బీఎంసీయూ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చిన్నయ్య దగ్గరుండి భూమిపూజ చేశారు. ఆ తర్వాత డెయిరీ నిర్వాహకులు పాడి రైతుల దగ్గర మెంబర్​షిప్​కోసం ఒక్కో గేదెకు రూ.708 చొప్పున వసూలు చేశారు.  అలాగే రైతులు రూ.3.50 లక్షలు చెల్లిస్తే డెయిరీ నుంచి రూ.6.50 లక్షలు లోన్​ ఇచ్చి 10 గేదెలు కొనిస్తామని మరికొందరు రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇలా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

లైంగిక వేధింపుల ఆరోపణలు.. 

ఆదినారాయణ, షేజల్​ జైలు నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై  లైంగిక ఆరోపణలు చేస్తూ ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతూ హైదరాబాద్​నుంచి సోషల్​ మీడియాలో వరుసగా వీడియోలు రిలీజ్​ చేశారు. బిజినెస్​ విషయాల్లో చర్చించడానికి పలుమార్లు హైదరాబాద్​ హైదర్​గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్​కు పిలిస్తే వెళ్లామని, అక్కడ మందు పార్టీ ఏర్పాటు చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు బ్రోకర్ల ద్వారా కొంతమంది అమ్మాయిలను ఆయన క్వార్టర్​కు పంపించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆదినారాయణతో చేసిన వాట్సాప్​ చాటింగ్​స్ర్కీన్​షాట్లను, ఎమ్మెల్యే దగ్గరికి పంపిన అమ్మాయిల ఫొటోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేశారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను కలిసి తమ గోడు చెప్పుకుందామంటే అపాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు సోషల్​ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని మనస్తాపం చెందిన ల్యాంకో హిల్స్​లోని తన ఫ్లాట్​లో టాయ్​లెట్​ క్లీనర్​ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు హాస్పిటల్​కు తరలించడంతో కోలుకున్నారు. 

ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు..

ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులపై రాష్ర్ట ప్రభుత్వం స్పందించకపోవడంతో షేజల్​ నెలరోజులుగా ఢిల్లీలో తన ఆందోళన కొసాగించారు. చిన్నయ్యపై నేషనల్​విమెన్​ కమిషన్​కు కంప్లయింట్​ చేయగా,  రిపోర్టు ఇవ్వాలని రాష్ర్ట పోలీసులను ఆదేశించింది. అలాగే షేజల్​ జంతర్​మంతర్​ వద్ద, ఢిల్లీలోని బీఆర్​ఎస్​ భవన్​వద్ద దీక్ష చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  దీంతో మనస్తాపం చెందిన ఆమె ఢిల్లీలో పురుగుల మందు తాగి మరోసారి సూసైడ్​ అటెంప్ట్​ చేయగా పోలీసులు ఆర్​ఎంఎల్​ హాస్పిటల్​కు తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చివరకు ఇటీవల మంత్రి కేటీఆర్​ ఢిల్లీ పర్యటన సందర్భంగా బీఆర్​ఎస్​ భవన్​ వద్ద దీక్ష చేపట్టారు. కేటీఆర్​సూచన మేరకు ఎంపీలు సురేశ్​రెడ్డి, వెంకటేశ్​నేత తదితరులు షేజల్​తో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా తనకు డబ్బులు ఇవ్వకున్నా ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని షేజల్ ​మీడియాతో వాపోయారు. 

రూ.30లక్షలు తీసుకుని కేసులు పెట్టించిండు.. 

ఎమ్మెల్యే చిన్నయ్య పలు దఫాలుగా తమ దగ్గర రూ.30 లక్షలు తీసుకుని కన్నాల శివారులో రెండెకరాల ప్రభుత్వ భూమిని డెయిరీకి కేటాయించి మోసం చేశారని ఆదినారాయణ, షేజల్  ఆరోపించారు. ఈ విషయంలో తాము ప్రశ్నించినందుకు కక్షపెంచుకుని రైతులను మోసం చేశారని బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ పోలీస్​స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తాము ఇచ్చిన డబ్బులతోనే ఎమ్మెల్యే చిన్నయ్య కన్నాలలో  కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో గృహప్రవేశం చేశారని ఆరోపించారు. రైతులను మోసం చేసిన కేసుల్లో ఆదినారాయణ, షేజల్​ను బెల్లంపల్లి పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.  వారిద్దరూ దాదాపు నెల రోజులు ఆదిలాబాద్​ జైల్లో ఉండి బెయిల్​పై రిలీజ్​ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వేధింపులపై బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 

మంత్రి కేటీఆర్​ కామెంట్లతో మనస్తాపం..

మూడ్రోజుల కింద మంత్రి కేటీఆర్​ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని క్లీన్​చిట్ ఇవ్వడాన్ని షేజల్​ జీర్ణించుకోలేకపోయారు. మంత్రి కేటీఆర్​ న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నప్పటికీ చిన్నయ్యను వెనకేసుకు రావడంతో మనస్తాపం చెందారు. ఇక ప్రభుత్వం, పోలీసు డిపార్ట్​మెంట్​తో తనకు న్యాయం జరిగే అవకాశం లేదని సూసైడ్​ నోట్​ రాసిన శేజల్​ గురువారం హైదరాబాద్​లోని పెద్దమ్మ గుడి దగ్గరలో మరోసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యే చేసిన ద్రోహంపై ఒక మహిళ నాలుగు నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడ్తున్నారు.  ఇప్పటికైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నిజాలను వెల్లడించాలని డిమాండ్​ చేస్తున్నారు.