చందుర్తి, వెలుగు : తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న విషప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే తిప్పి కొట్టిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. చందుర్తి మండలం నర్సింగాపూర్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీహామీని అమలు చేస్తామని, కోడ్ ముగియగానే ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందజేస్తామన్నారు.
200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే నిరుపేద కుటుంబాలకు జీరో బిల్లు అందజేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి రూ. లక్ష ఇస్తే, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రూ. 5 లక్షలు అందజేస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లీడర్లు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ ఎంపీటీసీ ఎర్రం శ్రీమన్నారాయణ, మాజీ ఉపసర్పంచ్ కాసారం శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ జలపతి పాల్గొన్నారు.