
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్టులో వెల్లడి
- తొలి స్థానంలో బీజేపీ.. 385 మంది ఎంపీల ఆస్తులు రూ.7,051 కోట్లు
- రాష్ట్రాల వారీగా ఎంపీల ఆస్తుల్లో తెలంగాణే ఫస్ట్.. ఏపీ సెకండ్
- ఓవరాల్గా పార్లమెంటులోనే అత్యధిక ఆస్తులున్న ఎంపీగా బండి పార్థసారథి
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో పార్టీల వారీగా అత్యధిక ఆస్తులున్న ఎంపీల జాబితాలో బీఆర్ఎస్ టాప్2 నిలిచింది. మొత్తం 16 మంది బీఆర్ఎస్ ఎంపీల ఆస్తులు రూ.6,136 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. తర్వాతి స్థానంలో ఏపీకి చెందిన అధికార వైఎస్సార్ సీపీ నిలిచినట్లు తెలిపింది. వైసీపీలోని 31 మంది ఎంపీల ఆస్తులు రూ.4,766 కోట్లు అని పేర్కొంది. ఈ జాబితాలో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో నిలవగా.. ఆ పార్టీకి చెందిన 385 మంది ఎంపీల ఆస్తులు రూ.7,051 కోట్లు అని చెప్పింది. నాలుగో స్థానంలో కాంగ్రెస్, ఐదో స్థానంలో ఆప్ తదితర పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 763 మంది ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులు, పార్టీల వారీగా ఆస్తులపై విశ్లేషణ జరిపి మంగళవారం ఈ మేరకు రిపోర్టును రిలీజ్ చేసింది.
రాష్ట్రాల వారీగా తెలంగాణ ఎంపీలు టాప్
ఆస్తుల విషయంలో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణకు చెందిన సిట్టింగ్ ఎంపీలు తొలిస్థానంలో ఉన్నారు. మొత్తం 24 మంది ఎంపీల ఆస్తులు రూ.6,294 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. తర్వాత స్థానంలో ఏపీ (36 మంది ఎంపీల ఆస్తులు రూ.5,427 కోట్లు), యూపీ (108 ఎంపీల ఆస్తులు రూ.3,340 కోట్లు), మహారాష్ట్ర (65 మంది ఎంపీల ఆస్తులు రూ.1,982 కోట్లు), పంజాబ్ (20 మంది ఎంపీల ఆస్తులు రూ.1,178 కోట్లు), కర్నాటక (39 మంది ఎంపీల ఆస్తులు రూ.1,339 కోట్లు), మధ్య ప్రదేశ్ (40 మంది ఎంపీల ఆస్తులు రూ.1,311 కోట్లు), తమిళనాడు (57 మంది ఎంపీల ఆస్తులు 1,203 కోట్లు), గుజరాత్ (37 మంది ఎంపీల ఆస్తులు) రూ.1,178 కోట్లు, వెస్ట్ బెంగాల్ (58 మంది ఎంపీల ఆస్తులు) రూ.1,050 కోట్లు అని వెల్లడించింది.
బండి పార్థసారథి టాప్
తెలంగాణకు చెందిన 24 మంది ఎంపీల్లో ఏడుగురి ఆస్తులు రూ.100 కోట్లకు పైనే ఉన్నాయని రిపోర్టులో ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం 24 మంది ఎంపీల సగటు ఆస్తులు దాదాపు రూ.262 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీల సగటు ఆస్తులు దాదాపు రూ.383 కోట్లుగా స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీకి చెందిన 31 మంది సగటు ఆస్తులు రూ.153 కోట్లు, టీడీపీకి చెందిన నలుగురు ఎంపీల సగటు ఆస్తులు రూ.100 కోట్లుగా పేర్కొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్కువ ఆస్తుల కలిగిన ఎంపీగా బీఆర్ఎస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి నిలిచారు. రూ.5,300 కోట్లతో సంపన్నుడిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాతి స్థానంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఆయోధ్య రామిరెడ్డి రూ. 2,577 కోట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీగా వైఎస్సార్ సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ఉన్నారు. ఆమె ఆస్తులు కేవలం రూ.1,41,179 మాత్రమేనని రికార్డుల్లో చూపారు.
రాష్ట్రంలో 13 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
తెలంగాణకు చెందిన మొత్తం 24 మంది (లోక్ సభ, రాజ్యసభ) ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. 9 మంది ఎంపీలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు, ముగ్గురిపై సీరియస్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇక ఎంఐఎం పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండగా... వారిద్దరిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 763 మంది ఎంపీల్లో 306 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలపై.. మహిళలపై క్రైమ్ కేసులు నమోదయ్యాయి.